భారత్ ఏం చేసినా కరెక్టే, ఇక్కడా దాడి చేయండి: బెలూచిస్తాన్ నేత
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏం చేసినా న్యాయమేనని బెలూచిస్తాన్ మద్దతుదారులు అన్నారు. జమ్ము కాశ్మీర్లోకి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు ఎల్వోసీ వద్ద దాడులు కొనసాగుతున్నట్లు డీజీఎంవో రణ్బీర్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బెలూచిస్తాన్ నాయకుడు మజ్దాక్ దిల్సాద్ మాట్లాడారు. పాక్ భూభాగంలోకి మూడు కిలో మీటర్ల మేర చొరబడి అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ల పైన నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ర్టయిక్స్) చేయడంపై స్పందించారు.
గురువారం మధ్యాహ్నం బెలూచిస్తాన్ మద్దతుదారులు మజ్దాక్ దిల్సాద్ అనే నాయకుడి ఆధ్వర్యంలో పాక్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఏం చేసినా సరైనదే అన్నారు. తాము ఇలాంటి దాడులకు మద్దతిస్తామన్నారు. ఇలాంటి దాడులు తమ ప్రాంతంలో కూడా చేయాలన్నారు.