షీనా హత్య! ఇంద్రాణితో కొడుకు 25కోట్ల 'సీక్రెట్' డీల్?
ముంబై: షీనా బోరా హత్య కేసు విషయంలో మరో కోణం వెలుగు చూసింది. తల్లి ఇంద్రాణిని కొడుకు మిఖాయిల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అంటే కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా సమాచారం మేరకు మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. కొడుకు మిఖాయిల్ తల్లి ఇంద్రాణిని బ్లాక్ మెయిల్ చేస్తుండవచ్చునని చెబుతున్నారు.
ఆ రోజు ఏం జరిగిందో చెప్పేందుకు మిఖాయిల్ తన తల్లితో డీల్ కుదుర్చుకునే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోందంటున్నారు. ఇంద్రాణి రహస్యాలు బహిర్గతం చేయకుండా ఉండేందుకు మిఖాయిల్ రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోందంటున్నారు.
తనను తన తల్లి ఇంద్రాణి చంపేందుకు నాలుగుసార్లు ప్రయత్నించిందని మిఖాయిల్ పోలీసులకు చెప్పాడు. అయితే, తనను తల్లి చంపాలని చూస్తే అప్పుడే అతను ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్న తలెత్తుతోంది.
అంతేకాదు, షీనా బోరా హఠాత్తుగా అదృశ్యం కావడంపై ఆమె మిత్రురాలు ఒకరు మిఖాయిల్ను గతంలో అడిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో అతను ఆశ్చర్యకర సమాధానం చెప్పాడని తెలుస్తోంది. షీనాను అమెరికాకు పంపించామని అతను చెప్పాడని సమాచారం.
ప్రతి నెల రూ.15,000 ఇంద్రాణి... మిఖాయిల్కు ఇచ్చేదని సమాచారం. అయితే, బెంగళూరులోని ఓ ప్రాపర్టీ కొనేందుకు తనకు రూ.20 నుంచి రూ.25 కోట్లు ఇవ్వాలని ఇంద్రాణిని బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న మిఖాయిల్.. హఠాత్తుగా ఓసారి రూ.12 లక్షల టాటా ఏరియా కారు కొన్నాడు. అవి ఇంద్రాణి ఇచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.
పీటర్ను విచారించిన పోలీసులు
ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియాను పోలీసులు విచారించారు. పీటర్ను, ఇంద్రాణిని ఒకే వద్ద ఉంచి పోలీసులు విచారణ జరిపారు. ఇదిలా ఉండగా, అంతకుముందు పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. షీనా బోరా కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని సోదాలు చేశారు.