కేజ్రీకి షాక్: స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ మంత్రి స్టాఫర్ (వీడియో)
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి (ఏఏపీ), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు షాక్. ఏఏపీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్టాఫర్ ఒకరు స్టింగ్ ఆపరేషన్లో లంచం డిమాండ్ చేస్తూ దొరికిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఇది ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. మంత్రి ఇమ్రాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
నార్త్ ఢిల్లీలోని బల్లిమరన్ ప్రాంతంలో ఓ నిర్మాణాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ తరఫున సదరు వ్యక్తి లంచం అడిగినట్లుగా వీడియో ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను మంత్రి కొట్టి పారేశారు.
ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజయ్ మాకెన్.. స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. లంచం అడుగుతున్న వ్యక్తి హమ్మద్ అని, అతను మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ కార్యాలయంలో పని చేస్తున్నారని మాకెన్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించి రెండు ఆడియోలను కూడా విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి, మంత్రి సోదరుడు, ఓ మున్సిపల్ కార్పోరేషన్ ఇంజినీర్ మాట్లాడుతున్నట్లుగా ఉంది. వీటిల్లో డబ్బులు అడుగుతున్నట్లుగా ఉందని తెలుస్తోంది.
దీనిపై మంత్రి హుస్సేన్ మాట్లాడుతూ.. తన పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తన పైన చేసిన ఆరోపణలను అజయ్ మాకెన్ నిరూపించగలరా అని సవాల్ చేశారు. నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. నిరూపించకుంటే మాకెన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.
కాగా, ఇమ్రాన్ హుస్సేన్ గత ఏడాది అక్టోబర్ నెలలో మంత్రి అయ్యారు. అంతకుముందు ఉన్న ఆసిమ్ అహ్మద్ ఖాన్ను తొలగించిన కేజ్రీవాల్.. ఆయన స్థానంలో హుస్సేన్ని మంత్రిగా చేశారు. ఇంతకుముందు మంత్రి పైన కూడా లంచం ఆరోపణలు వచ్చాయి.
బిజెపి ఢిల్లీ యూనిట్ అధ్యక్షులు సతీష్ ఉపాధ్యాయ బుధవారం మాట్లాడుతూ... స్టింగ్ ఆపరేషన్, వీడియో క్లిప్స్ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఏపీలో దాదాపు 32 మంది పైన కేసులు ఉన్నాయని, ఏడుగురు ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారని, ఇదేం ప్రభుత్వమని ప్రశ్నించారు.
కాగా, దేశంలో ఏం జరిగినా ప్రధాని మోడీకి లింక్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్... ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా స్టింగ్ ఆపరేషన్ వీడియో వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ డిమాండ్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.