అధికారిణిలతో అందాల జాబితానా..! : నిలదీసిన ఐపీఎస్ అధికారిణి
కేరళ : మార్కెట్ పరిధిని విస్తరించుకోవాలనే ఆలోచనలో, ప్రజలను ఆకట్టుకోవాలనే ఆతృతలో కనీస విలువలకు తిలోదకాలిస్తున్నాయి కొన్ని పత్రికలు. అధికారుల పనితీరుపై విశ్లేషణలు రాయాల్సింది పోయి, వాళ్ల అంద చందాలపై ఫోకస్ చేస్తూ ఓ హిందీ పత్రిక ప్రచురించిన వార్తపై ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మెరిన్ జోసెఫ్ అనే కేరళ ఐపీఎస్ అధికారిణి సోషల్ మీడియా ద్వారా సదరు పత్రికను నిలదీసింది.
సదరు పత్రిక ప్రచురించిన " దేశంలో అత్యంత అందమైన టాప్-10 ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణిల జాబితా" అనే వార్తను తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసిన మెరీన్, పత్రికపై పలు ప్రశ్నలు సంధించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, 'అందమైన ఐపీఎస్, ఐఏఎస్ పురుష అభ్యర్థుల జాబితాను పత్రికలు ఎప్పుడైనా ప్రచురించడం జరిగిందా..?' అంటూ ప్రశ్నించారు.
మున్నార్ ఏఎస్పీగా కేరళలో విధులు నిర్వర్తిస్తున్న మెరీన్.. ఐఏస్, ఐపీఎస్ ల ప్రతిభను పక్కనబెట్టి వాళ్లను అందంతో కొలవడం ఖచ్చితంగా లింగ వివక్ష చూపడమేనన్నారు. భారతీయ మీడియా మహిళలను వక్ర దృష్టితో చూస్తోందని మండిపడ్డ ఆమె, రూపు రేఖలు ప్రతిభకు ఎలా కొలమానాలవుతాయంటూ నిలదీశారు. సంక్లిష్టమైన భారత బ్యూరోక్రసిలో ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ పనిచేస్తోన్న అధికారిణలను ఇలా మోహ దృష్టితో చూపించే జాబితాలను సిద్దం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ఐపీఎస్ మెరీనా వ్యాఖ్యలకు చాలామంది నెటిజన్లు మెరీనాకు మద్దతు పలుకుతున్నారు. రాజకీయ వ్యవస్థలో నిత్యం సవాళ్లను స్వీకరిస్తూ, మంచి చెడులతో పోరాటం చేస్తున్న అధికారిణులను అంద చందాల అంచనాతో టార్గెట్ చేయడం దుర్మార్గమైన చర్య అంటూ వార్తను ప్రచురించిన హిందీ పత్రికకు చురకలంటిస్తున్నారు.
అయితే మెరీనాకు సంబంధించి గతంలో ఆమె చేసిన చాలావరకు సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో మహిళ అనే కారణంతోనే ఆమెకు సోషల్ మీడియాలో అంత ఫోకస్ లభిస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో ఎండలో నడుస్తున్న మెరీనాకు ఓ జూనియర్ అసిస్టెంట్ గొడుగు పట్టడం, మరో సందర్భంలో నటుడు నవీన్ పౌలీతో తన ఫోటో తీయాల్సిందిగా మెరీనా ఓ ఎమ్మెల్యేను కోరడం వంటివి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించాయి.