గౌరవాన్ని ఫణంగా పెట్టి కాదు: చైనాపై రాజ్నాథ్
గ్రేటర్ నోయిడా: చైనాతో తాము శాంతినే కోరుకుంటున్నామని, అయితే తమ దేశ గౌరవాన్ని ఫణంగా పెట్టి మాత్రం కాదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గౌరవంతో కూడిన శాంతిని తాము కోరుకుంటున్నామని, గౌరవాన్ని ఫణంగా పెట్టి శాంతి సాధన సాధ్యం కాదని ఆయన అన్నారు. చైనాతో సరిహద్దు సమస్యపై ఆయన ఆ విధంగా అన్నారు.
చైనా, భారత్ సరిహద్దుల్లో రక్షణగా ఉండే ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసు 53వ రైజింగ్ డే వేడుకల్లో ఆయన శుక్రవారంనాడు ప్రసంగించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
వివాదం ఉంటే చర్చించుకుందామని మన ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడితో స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. చైనా తరుచుగా సరిహద్దు సమస్యను ముందుకు తెస్తోందని, భారత్ తన ప్రదేశంలో సరిహద్దు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రయత్నించినప్పుడు అభ్యంతరం తెలుపుతోందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై, పౌరులు నివసించే ప్రాంతాలపై కాల్పులు ఆపాల్సి ఉంటుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. దీపావళికి ముందు రోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుపై, పౌరులు నివసించే ప్రాంతాలపై కాల్పులు జరిపిందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినా, భారత - చైనా సరిహద్దు విషయంలో వివాదం ఉందని అన్నా తమ మనోభావాలు దెబ్బ తింటాయని, ఆగ్రహం కలుగుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మానేయాలని తాను చెబుతున్నానని ఆయన అన్నారు. తమ సాయుధ బలగాలు తిప్పికొట్టగలవని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి ఐక్య రాజ్యసమితికి పాకిస్తాన్ వెళ్లడాన్ని ఆయన వ్యతిరేకించారు. సమస్యలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు పాకిస్తాన్ గానీ చైనా గానీ తమ దేశం పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటోందని, తాము వసుధైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్ముతామని, భారత్ ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన అన్నారు.
భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించబోదని, భారత్ శాంతినే కోరుకుంటుందని ఆయన ఆ తర్వాత మీడియాతో అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచే ఎల్లవేళలా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగిందని ఆయన అన్నారు.