ప్రేమకు నో: యువతికి బట్టలూడదీస్తామని బెదిరింపు
కోల్కతా: పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ యువతిపై కొందరు అల్లరి మూకలు దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేగాక, తన ప్రేమను అంగీకరించకుంటే బట్టలూడదీసి రేప్ చేస్తామని ఓ యువకుడు ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా, దాడి చేసిన వారి గ్రూపులో మహిళలు కూడా ఉండటం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ విద్యార్థిని బోర్డ్ ఎగ్జామ్ రాసేందుకని దూప్గురి ప్రాంతానికి వెళ్తోంది. దారిలో ఓ దుండగుల బృందం ఆ బాలికను అడ్డుకుంది. అందులోని ఓ యువకుడు తనను ప్రేమించాలంటూ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. కాగా, ఆ విద్యార్థిని అతడి ప్రేమను అంగీకరించలేదు.
దీంతో ఆగ్రహానికి గురైన వారు ఆ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. అందులోని ఓ మహిళ బాధిత విద్యార్థినిపై తిట్ల పురాణం మొదలెట్టగా, యువకులు అమెను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశారు. చివరికి ఆ విద్యార్థిని వారి నుంచి తప్పించుకుంది.
అనంతరం ఓ అధికారి ఆ విద్యార్థినిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. కాగా, బాధితురాలు ఆస్పత్రి బెడ్ మీద నుంచే బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ దాడికి పాల్పడ్డ అసలు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జల్పాయిగురి ఎస్పీ ఆకాశ్ మేఘారియా తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11మంది స్థానికులు వాన్ రిక్షాలో వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న రిక్షాను ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీకొట్టాయి. దీంతో ఆ రెండు ట్రక్కుల మధ్య రిక్షా ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు ట్రక్కుల డ్రైవర్లు పరారీలో ఉన్నారని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.