మమ్మల్ని కొట్టారు సరే, విజయ్ మాల్యా సంగతేంటి: రైతు భార్య
చెన్నై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను వదిలేసి తమను చితకబాదటం ఏమిటని ఓ రైతు భార్య ప్రశ్నించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.
తమిళనాడులో ఓ రైతును పోలీసులుచితకబాదారు. అతడు చేసిన నేరం ఏమిటంటే... బ్యాంకు నుంచి రూ.1.30 లక్షలు అప్పు తీసుకొని చెల్లించలేదు. దీంతో పోలీసులు అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. దీనిని ఒకరు వీడియో తీసి ఆన్లైన్లో పెట్టారు.
జి బాలన్ అనే రైతు బ్యాంకు నుంచి రూ.3.4 లక్షలు అప్పు తీసుకున్నారు. ఓ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు ఈ అప్పు, దాని మీద వడ్డీ కింద రూ.4.1 లక్షల వరకు బ్యాంకుకు చెల్లించాడు. కరువు కారణంగా ఈసారి పంట సరిగ్గా రాలేదు. దీంతో రెండు నెలలు వాయిదాలు కట్టలేదు.
బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ రైతును చితకబాదారు. ట్రాక్టర్ లాక్కొని వెళ్లారు. ప్రత్యక్ష సాక్షులు వీడియో తీసి నెట్లో పెట్టారు. మరోవైపు, పోలీసుల తీరు పైన రైతు భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్ మాల్యా అంశాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాని యథేచ్చగా వదిలి పెట్టి, మా పేద రైతులను మాత్రం వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాలం కలిసి రాక రుణాలు చెల్లించలేదని వేడుకున్నా పోలీసులు కనికరించలేదన్నారు. తమ నుంచి ట్రాక్టర్ను బలవంతంగా తీసుకు వెళ్లారన్నారు. పోలీసులు స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకే తాము ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.