మోడీజీ మీకు శుభాకాంక్షలు: భారత ప్రధానికి ట్రంప్ ఫోన్
భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ తోపాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు మోడీకి ట్రంప్ శుభాకా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ తోపాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు మోడీకి ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ ఓ ప్రకటన చేశారు. ఇదివరకు ట్రంప్.. మోడీకి ఫోన్ చేసినా.. భారత్ అంతర్గత విషయాలపై ఆయన స్పందించడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఆయన ఫోన్కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై వీరిరువురు చర్చించిందీ లేనిదీ తెలియరాలేదు. కాగా, జర్మనీలో జరిగిన తాజా ఎన్నికల్లో చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మెర్కెల్కు కూడా ట్రంప్ శుభాకాంక్షలు తెలిపినట్టు సీన్ స్పైసర్ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.