వాట్సప్ పుట్టి ఎనిమిదేళ్లు! ఇక డిజిటల్ చెల్లింపుల దిశగా కసరత్తు?
మెసేజింగ్ యాప్ వాట్సప్ లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతున్నట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్ తెలిపారు.
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సప్ లో యూజర్లు తమ నగదు లావాదేవీలను నిర్వహించుకునేలా మరో అదనపు ఫీచర్ కూడా చేరబోతోందా? అంటే అవుననే అంటున్నారు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్.
మాజీ యాహూ ఉద్యోగులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ 2009లో ప్రారంభించిన వాట్సప్.. శుక్రవారం ఎనిమిదో సంవత్సరంలోకి ప్రవేశించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ కు 1.2 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇందులో భారతదేశంలోనే 200 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
పేటీఎం మాదిరిగా వాట్సప్ ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అవసరమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో వాట్సప్ ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలెట్టిందని, ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి మరికొంత కాలం పడుతుందని తెలుస్తోంది.
భారత పర్యటనకు వచ్చిన యాక్టన్.. కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. డిజిటల్ ఇండియా సాక్షాత్కరం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని యాక్టన్ అభినందించారు.