డ్రైవర్ను డాక్టర్ చేసిన కలాం: పరీక్ష కోసం విమానం
హైదరాబాద్/చెన్నై: మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం దేశంలో అనేకమందికి స్ఫూర్తి ప్రదాత. ఆయన మాటలతో స్ఫూర్తి పొందిన ఎంతోమంది ఉన్నతస్థానాలను చేరుకున్నారు. కాగా, హైదరాబాద్లోని డిఆర్డిఎల్లో దాదాపు పాతికేళ్ల క్రితం జరిగిన ఘటన ఒకటి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
తమిళనాడుకు చెందిన వి కదిరేశన్ అనే సిపాయి ర్యాంకు ఉద్యోగి. ఆయన అబ్దుల్ కలాం వద్ద డ్రైవర్గా పనిచేసేవారు. అప్పుడు కదిరేశన్ వయస్సు 19 సంవత్సరాలు. ఒక రోజున కారులో ఇంటికి వెళుతుండగా కదిరేశన్ను కలాం అడిగారు... ‘నువ్వేం చదువుకున్నావ్?' అని.. తాను పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యానని చెప్పాడు కదిరేశన్. తన తండ్రి మరణం, కుటుంబ పరిస్థితుల వల్ల చదువు ఆపేశానని జవాబిచ్చాడు. దీంతో వెంటనే కలాం ఒక నిర్ణయానికి వచ్చారు.
డిఆర్డివోలో కలాం తీరిక లేకుండా ఉన్నప్పటికీ... కదిరేశన్ కోసం సమయం వెచ్చించారు. రోజూ సాయంత్రం ఆ సిపాయికి ఇంగ్లీష్ భాష వ్యాకరణం బోధించి అతను పదో తరగతి పాసయ్యేలా చేశారు. అంతటితో ఆగలేదు కలాం. కదిరేశన్కి తనే ఫీజులు, పుస్తకాలు కొనిచ్చి ప్లస్ టూ పాస్ అయ్యేలా ముందుకు నడిపించారు. అప్పటికీ విద్యావిజ్ఞాన ప్రియుడైన కలాంకు సంతృప్తి కలగలేదు. ఆ కుర్రాడికి కంప్యూటర్ కోర్స్ నేర్పించాలనుకున్నారు.
కానీ, కదిరేశన్కు భయమేసి, కలాంను ఒప్పించి బిఎ హిస్టరీ తీసుకున్నాడు. అయినా ఆ కలాం వదల్లేదు, కదిరేశన్కు ప్రపంచ చరిత్ర, ఐరోపా చరిత్ర, ప్రపంచ యుద్ధాల గురించి వివరంగా బోధించి బిఏ పట్టా అందుకునేలా చేశారు. అక్కడితో ఆగితే ఆయన కలాం ఎందుకవుతారు.. అందుకే కదిరేశన్ని మదురై కామరాజు యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యమన్నారు.
కుర్రాడైన కదిరేశన్కు ఆనాడు చదువు విలువ తెలియక, అసంతృప్తికి గురయ్యేవాడు. అయితే ఏనాడూ కలాం ముందు బయటపెట్టక భయభక్తులతోనే ఉన్నాడు. అలా ఎంత దూరం నడిపించారంటే.. తన డ్రైవర్ శిష్యుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలు మిస్ కాకూడదన్న తపనతో విమానం ఎక్కించి మరీ చెన్నై పంపారు.
అలా పదేళ్లలో పదో తరగతి, ఇంటర్, బిఎ, ఎమ్మే, బిఇడి, ఎంఇడి, ఎమ్మే పొలిటికల్ సైన్స్ వన్ సిట్టింగ్ కోర్సులు పూర్తి చేయించారు. ఆ తర్వాత కలాం ఆదేశంతో తిరునెల్వేలిలోని మనోన్మనియం సుందరనార్ యూనివర్శిటీ నుంచి కదిరేశన్ చరిత్రలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. అలా డ్రైవర్ కదిరేశన్.. కలాం అండతో డాక్టర్ కదిరేశన్ అయ్యారు.
ఈ పయనం అలా కొనసాగుతూ ప్రస్తుతం తిరునెల్వేలిలోని ప్రభుత్వ కళాశాలలో అత్యున్నత విద్యార్హతలున్న లెక్చరర్గా పనిచేస్తున్నారు. కలాం ఎప్పుడు దక్షిణాది పర్యటనకు వచ్చినా... కదిరేశన్ యోగక్షేమాలు విచారించకుండా వెళ్లేవారు కాదు. తన గురువు, మార్గదర్శకుడైన కలాం కోరినా కంప్యూటర్స్ నేర్చుకోనందుకు ఇంకా బాధగానే ఉందన్నారు కదిరేశన్. ప్రస్తుతం ఆయన రామేశ్వరంలో కలాం అంత్యక్రియలకు బయల్దేరారు.