రాహుల్ కిసాన్ పాదయాత్రపై శివసేన: 'అప్పుడు రైతుల కష్టాలు గుర్తుకురాలేదా'
ముంబై: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు కష్టాలను తెలుసుకునేందుకు చేపట్టిన పాదయాత్రపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో కరువు ప్రాంతమైన విదర్భలో రైతుల కష్టాలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై శివసేనకు చెందిన సామ్నా పత్రిక సంపాదకీయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు రాహుల్కు గుర్తుకురాలేదా అని శివసేన ఆరోపించింది. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు కేటాయించిన నష్టపరిహారం సొమ్ము ఎందుకు అందలేదని రాహుల్ గాంధీని శివసేన ప్రశ్నించింది.
మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా మాట్లాడని రాహుల్, ఇప్పుడెందుకు వ్యవసాయ రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన ధరలు కల్పించాలంటూ మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోసింది. అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పైనా శివసేన ఆగ్రహం వ్యక్తంచేసింది. రైతుల ఆత్మహత్యలు, సమస్యలకు పరిష్కారం కావన్న ఫడ్నవీస్ వ్యాఖ్యలపైనా శివసేన తీవ్రంగా స్పందించింది.
మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కూడా శివసేన వదల్లేదు. గత కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఎన్సీపీ అధినేత కళ్లు రైతుల పరిస్ధితులపై ఇప్పుడే తెరుచుకున్నాయని మండిపడింది. పిరికితనం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హర్యానా మంత్రి ఓమ్ ప్రకాశ్ ధన్కర్పై కూడా మండిపడింది.
రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో కిసాన్ పాదయాత్ర పేరుతో 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. కిసాన్ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గుంజ్ నుంచి టోంగ్లాబాద్ వరకు ఐదు గ్రామాలను సందర్శించి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించారు.