ట్విస్ట్, లాలు ఉలిక్కిపాటు: మళ్లీ నితీషే సీఎం, బయటి నుంచి బిజెపి మద్దతు
తన తనయుడు తేజస్వి యాదవ్ రాజీనామా చేయరని, ధైర్యం ఉంటే తమతో బంధం తెంచుకోవాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన సవాల్కు తన రాజీనామాతో నితీష్ గట్టి జవాబు ఇచ్చారు. లాలూ ఇది ఊహించి ఉండరు.
పాట్నా: తన తనయుడు తేజస్వి యాదవ్ రాజీనామా చేయరని, ధైర్యం ఉంటే తమతో బంధం తెంచుకోవాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన సవాల్కు తన రాజీనామాతో నితీష్ గట్టి జవాబు ఇచ్చారు. లాలూ ఇది ఊహించి ఉండరు.
చదవండి: ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది: నితీష్ సంచలనం, ప్రశంసించిన మోడీ
హఠాత్తుగా నితీష్ రాజీనామా చేయడంతో లాలు, ఆర్జేడీ ఉలిక్కిపడి ఉంటుంది. నితీష్కు క్లీన్ ఇమేజ్ ఉంది. గతంలో బిజెపితోను ఆయనకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. లాలూతో ఇలాగే ఐదేళ్లు కలిసి నడిస్తే తనపై ఉన్న క్లీన్ ఇమేజ్ పోతుందని నితీష్ ఆందోళన చెందుతున్నారు.
చదవండి: సంక్షోభం, లాలూ సవాల్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా
మధ్యంతరమా లేక మళ్లీ సీఎంగానా?
నితీష్ రాజీనామా నేపథ్యంలో బీహార్ రాజకీయాలు ఏ వైపు తిరుగుతాయనే చర్చ సాగుతోంది. మధ్యంతరానికి వెళ్తారా లేక బిజెపితో కలిసి మళ్లీ సీఎం అవుతారా అనే చర్చ సాగుతోంది. బిజెపితో కలిసి ముందుకు నడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు.
రెండేళ్లు తిరక్కుండానే.. బిజెపి బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చు
2015 నవంబర్ 20వ తేదీన నితీష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లాలూ కుటుంబం కారణంగా రెండేళ్లు తిరక్కుండానే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయనకు బిజెపి బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశముంది. జేడీయూకు ఎన్డీయే బలం తోడైతే నితీష్ మళ్లీ సీఎం కావొచ్చు.
మూడేళ్లు బిజెపితోనే బెట్టర్
బీహార్లో 243 స్థానాలు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 122. జేడీయుకు ఉన్న 71, ఎన్డీయేకు ఉన్న 58 స్థానాలు కలిస్తే 129 లెక్కకు వస్తుంది. కూటమికి దూరమైన నితీష్కు బిజెపి బయటి నుంచి మద్దతు ఇచ్చి.. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బిజెపి, నితీష్లు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఐదేళ్లు లాలూతో కలిసి క్లీన్ ఇమేజ్ చెడగొట్టుకోవడం కంటే మిగతా మూడేళ్లు బిజెపితో కలిసి నడవడమే మంచిదని నితీష్ భావించారని అంటున్నారు. అందుకే, లాలూకు షాకిచ్చేలా రాజీనామా చేసిన నితీష్.. బిజెపితో కలిసి మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటారని చెబుతున్నారు.
బీజేపీలో కదలిక
నితీష్ రాజీనామా నేపథ్యంలో ఆ పార్టీ ఆయనకు మద్దతు పలికింది. అలాగే, బీహార్ బీజేపీ అధ్యక్షులు సుశీల్ మోడీతో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడారు. బీజేపీ అగ్రనేతలు కూడా సమావేశమవుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షులు సుశీల్ భేటీ అవుతున్నారు.
ఇదీ బీహార్ అసెంబ్లీ లెక్క
గత అసెంబ్లీ ఎన్నికల్లో మోడీపై కోపంతో నితీష్ కుమార్ తన పాతికేళ్ల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి లాలూ ప్రసాద్తో జత కలిశారు. వీరి కలయికలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది. దీంతో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. గత ఎన్నికల్లో జేడీయుకు 71, ఆర్జేడీకి 80, కాంగ్రెస్కు 27, బిజెపికి 53 (ఎన్డీయేకు 58) స్థానాలు ఉన్నాయి.