పాత నోట్లు ఉంటే.. పారేసుకోకండి, మరో చాన్స్ ఇవ్వడంపై కేంద్రం యోచన
రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేయలేని వారికి మరో అవకాశం ఇవ్వడంపై మరో రెండు వారాల్లో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం మంగళవారం హామీ ఇచ్చింది.
న్యూఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేయలేని వారికి మరో అవకాశం ఇవ్వడంపై మరో రెండు వారాల్లో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం మంగళవారం హామీ ఇచ్చింది.
పాతనోట్లు మార్చుకోవడంపై హఠాత్తుగా తేదీలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. సర్కారు మాట మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
మార్చి నెలాఖరు వరకు నగదు జమ చేసుకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దీంతో రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సర్కారు తరపున హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు.
2016 డిసెంబర్ 30 లోగా నిజమైన ఇబ్బందుల కారణంగా నోట్లు జమచేయలేకపోయిన వారు ఆ తరువాత 2017 మార్చి 31 వరకు రిజర్వ్ బ్యాంక్ శాఖల్లో వాటిని మార్చుకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎస్కే కౌల్ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. నిజమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి మార్చి 31 వరకు మరో అవకాశం ఉంటుందన్న ప్రధాని మాటలు ఆశలు కలిగించాయని ధర్మాసనం నొక్కి చెప్పింది.
ఎన్నారైలకు, విదేశీ పర్యటనలో ఉన్న భారతీయులకు మాత్రమే అవకాశం ఇచ్చి ఇతరులను ఎందుకొదిలేశారని నిలదీసింది. ఏప్రిల్ 11 లోగా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ప్రధాని హామీని.. ఆ తరువాత జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేసిందని ఒక పిటిషనర్ తరపు న్యాయవాది సుధామిశ్రా కోర్టుకు తెలిపారు.
నోట్ల మార్పిడి అవకాశాన్ని ఎవరికి కల్పించవచ్చన్న దానిపై.. పార్లమెంట్ అధికారాన్ని ప్రభుత్వానికి అందజేసిందన్న అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. ''మీకు నిర్ణయాధికారం ఉండొచ్చు.. కానీ అది ఇష్టారీతిన ఉండరాదు, సర్కారే అంతిమ నిర్ణేత అని మీరు అంటున్నారు.. దానిని ఒప్పకునేందుకు మేం సిద్ధంగా లేం..''అని ధర్మాసనం స్పష్టం చేసింది.
డిసెంబర్ 30తో నోట్ల మార్పిడి ముగిసిపోయినట్లు సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయడం సరికాదని తెలిపింది. ఎన్నారైలకు అవకాశం ఇచ్చి ఇతర పౌరులను ఎందుకు వదిలేశారో మీరు వివరించాలని అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మరోవైపు ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించినందున పిటిషనర్లు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చని ధర్మాసనం హెచ్చరించింది. అయితే పిటిషన్లను ఉపసంహరించుకుంటే వారిపై కేసులు వేయబోమని అటార్నీ జనరల్ హామీ ఇచ్చారు.