అంతా 'టాయిలెట్స్' వల్లే: హస్తానికి వాస్తు గండం, ఇదో వింత వాదన!
మూడో అంతస్తులో టాయిలెట్స్ తూర్పు ముఖంగా ఉండటం వల్ల వాస్తు దోషం తమను వెంటాడుతోందని చెప్పుకొస్తున్నారు.
భోపాల్: డబ్బు, పలుకుబడి తర్వాత ఈరోజుల్లో రాజకీయాలను అంతగా ప్రభావితం చేస్తున్నదీ 'వాస్తు' అనడంలో అతిశయోక్తి లేదేమో!. వాస్తు దోషం కారణంగానే ఎన్నికల వాకిట్లో బోల్తా పడ్డామని భావించే నేతలకు రాజకీయాల్లో కొదువ లేదు. క్షేత్ర స్థాయి నిజనిజాలను విస్మరించి.. 'వాస్తు' చట్రంలో ఇరుక్కుపోయిన రాజకీయాలు సామాన్యులకు నవ్వు తెప్పించేవిగా మారుతున్నాయి.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో మరో అడుగు ముందే ఉన్నారు. వరుసగా ఎన్నికల్లో ఎదురవుతున్న పరాభవానికి వారు చూపిస్తోన్న కారణమేంటంటే... 'టాయిలెట్స్'. భోపాల్ లోని కాంగ్రెస్ భవన్ లో టాయిలెట్స్ సరైన ప్రదేశంలో లేనందువల్లే కాంగ్రెస్ కు వాస్తు దోషం పట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
గత 14ఏళ్ల నుంచి ఎదురవుతున్న పరాభవానికి వాస్తు మాత్రమే కారణమని తేల్చి పారేస్తున్నారు. కాంగ్రెస్ భనవ్ లోని మూడో అంతస్తులో టాయిలెట్స్ తూర్పు ముఖంగా ఉండటం వల్ల వాస్తు దోషం తమను వెంటాడుతోందని చెప్పుకొస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కెకె మిశ్రా మాత్రం ఈ వింత వాదనను కొట్టిపారేశారు. ప్రజల మద్దతుతోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని అన్నారు.