ముందే అస్త్ర సన్యాసం: మహా కూటమి ఆశలకు ‘నితీశ్’ చిల్లు
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరటంతో 20 నెలల్లోనే ‘మహా కూటమి’ కథ కంచికి చేరింది.జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి ఏర్పాటు ఆశలు కల్లలుగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎటూ మొగ్గని
న్యూఢిల్లీ: బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరటంతో 20 నెలల్లోనే 'మహా కూటమి' కథ కంచికి చేరింది. జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి ఏర్పాటు ఆశలు కల్లలుగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేయొచ్చేమో గానీ.. బీజేపీయేతర పార్టీల మధ్య సయోధ్య లేకపోతే అలాంటి ప్రభుత్వం ఎంతోకాలం మనలేదనే విషయాన్ని ఇది రుజువు చేసింది. బీహార్ రాష్ట్రంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య ఏమాత్రం సఖ్యత లేదనటానికి మహ కూటమి విచ్ఛిన్నమే స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన ఈ రెండు పార్టీల మధ్య 2015 నవంబర్ నుంచే.. అంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే విభేదాలు ప్రారంభమయ్యాయన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఆ విభేదాలే రోజురోజుకు రాజుకుంటూ చివరికి కూటమి మనుగడకే నిప్పుపెట్టాయి.
దేశవ్యాప్తంగా బీహార్ మాదిరి కూటమితో వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించాలని కలలుగంటున్న ప్రతిపక్షాలకు.. ముఖ్యంగా కాంగ్రెస్కు ఇది ఏమాత్రం రుచించని విషయం. గత మూడేళ్లుగా పార్లమెంటులో ప్రతిపక్షాలను కూడగట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నా ఆచరణకు నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
యూపీపై బీహార్ ప్రభావం ఇలా
ప్రగతి అనుకూల, అవినీతి వ్యతిరేక రాజకీయ నాయకుడిగా పేరొందిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ను మోదీ ప్రభంజనానికి వ్యతిరేకంగా విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ముందు ఉంచి 2019 లోక్ సభ ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవాలని రెండు రోజుల క్రితం వరకూ దాదాపు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు వ్యూహ రచనలు చేస్తూ వచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ అవినేతే ప్రధాన అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నమైన తక్షణ ప్రభావం ఉత్తర్ప్రదేశ్లో వ్యక్తం కావొచ్చు.
Recommended Video
మాయావతికి ఇలా అఖిలేశ్ మద్దతు?
బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన వ్యూహాలను పునః సమీక్షించుకునేందుకు దారి తీయవచ్చునని భావిస్తున్నారు. ఉమ్మడి శత్రువైన బీజేపీని ఎదుర్కోవటానికి ఆయన తన చిరకాల ప్రత్యర్థి బీఎస్పీతోనూ రాజీకి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. త్వరలో ఫూల్పుర్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థిని నిలబెట్టకుండా బీఎస్పీ మాయావతికి పరోక్షంగా మద్దతివ్వటానికీ ఆయన సిద్ధపడుతుండటమే దీనికి నిదర్శనం. ‘అఖిలేశ్ నుంచి ఇలాంటి సంకేతాలు వచ్చిన తర్వాతే మాయావతి 10 నెలల ముందుగా రాజ్యసభకు రాజీనామా చేశారు' అన్నది విశ్వసనీయ వర్గాల అభిప్రాయం. ప్రజాస్వామ్యం బలహీనపడకుండా కాపాడటానికి లౌకిక శక్తులన్నీ ముందుకు రావాలనీ బీఎస్పీ అధినేత మాయావతి పిలుపునివ్వగా.. ‘వద్దు వద్దనుకుంటూనే తిరిగి నీ ప్రేమలో పడ్డాను' అని అర్థం వచ్చే హిందీ పాటతో అఖిలేశ్ తన ట్వీట్ ద్వారా బీహార్ సీఎం నితీశ్ తీరును ఎద్దేవా చేశారు.
కేంద్ర క్యాబినెట్లోకి కేశవ్ ప్రసాద్ మౌర్య?
అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య ఇక ఫూల్పుర్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేయాల్సి రావచ్చు. కానీ కేశవ్ ప్రసాద్ మౌర్యను ఎంపీగా కొనసాగుతూ కేంద్ర క్యాబినెట్లో చేరాలని ప్రధాని మోదీ కోరే అవకాశాలు ఉన్నాయని ఆ వార్తా కథనం సారాంశం. కేశవ్ ప్రసాద్ మౌర్య తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అన్న అంశాన్ని బట్టే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి యత్నాలు ప్రస్తుతానికి ఫలిస్తాయా? లేదా? అన్న సంగతి తేలనున్నది.
`ఆర్జేడీ అధినేతను అరెస్ట్ చేస్తారా?
టీఎంసీ అధ్యక్షురాలు - పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంకా నితీశ్ చర్యను ఖండించలేదు గానీ ఇచ్చిన హామీకి కట్టుబడి, వచ్చేనెల 27వ తేదీన పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తలపెట్టిన బీజేపీకి హఠావో - దేశ్ కి బచావ్ పేరిట బీజేపీయేతర పార్టీల సభకు హాజరవుతానని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయ పడ్డారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత మాయావతితో పాటు కొందరు కాంగ్రెస్, వామపక్ష నేతలు కూడా ఇందులో పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో ‘లౌకిక ప్రత్యామ్నాయం' మొగ్గ తొడిగే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు. వచ్చేనెల 27వ తేదీకి లాలూ ప్రసాద్ను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసే అవకాశమూ లేకపోలేదు.
వెంకయ్యకు ఓట్లు పెరుగుతాయి...
ఇదిలా ఉంటే రాజ్యసభలో పెరగనున్న ఎన్డీయే బలం పెరగనున్నది. ఎన్డీయేలో జేడీయూ చేరికతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 74 నుంచి 84కు పెరగనుంది. ప్రస్తుతం జేడీయూకు రాజ్యసభలో 10 మంది, లోక్సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థికి ఓటేస్తామని గతంలో ప్రకటించిన జేడీయూ ఇప్పుడు అధికారికంగా ఎన్డీఏలో చేరినందున ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడుకు పడే ఓట్లు కూడా పెరగనున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి గెలిచే అవకాశముందనే భావన బలపడుతుండటంతో ప్రాంతీయ పార్టీలు, ఎటూ మొగ్గని పార్టీలు కూడా బీజేపీకి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.