‘రాష్ట్రపతి’గా రామ్నాథ్ కోవిందే ఎందుకు?: ఆయన ప్రత్యేకత ఏంటి?
న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు ఎన్నో పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేశారు. ఎవరూ ఊహించని విధంగా దళిత వర్గానికి చెందిన కోవింద్ను ఎంపిక చేయడంతో రాష్ట్రపతి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది.
అయితే, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, అట్టడుగు వర్గాల ప్రతినిధిగా పేరుపొందిన రామ్నాథ్ను పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం బీహార్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్నాథ్: ఎవరీ కోవింద్?
అయితే, రామ్నాథ్ ఎంపికపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మమతా బెనర్జీ అధినేత్రిగా ఉన్న టీఎంసీ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అద్వానీని లేక సుష్మాస్వరాజ్ను ఎంపిక చేస్తే బాగుండేదని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. వామపక్షాల నేతలు మాత్రం ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయంటూ దళిత వర్గానికే చెందినప్పటికీ రామ్నాథ్ కోవింద్ను వ్యతిరేకించారు. కాగా, బీహార్ సీఎం మాత్రం రామ్నాథ్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు.
అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం
రామ్నాథ్ కోవింద్.. సమాజంలోని దళిత, ఆదీవాసీ, మైనార్టీ, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. చేస్తూనే ఉన్నారు. 1997లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొన్ని నిబంధనలు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండటంతో దానిపై న్యాయపరమైన పోరాటం చేశారు. చివరకు వాజ్పేయి ప్రధానిగా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన సమయంలో వాటిని రద్దు చేయించారు. పేదలకు సంబంధించిన పలుకేసులను ఆయన వాదించి విజయం సాధించారు.
కీలకమైన పదవులు చేపట్టిన రామ్ నాథ్
కోవింద్ అనేక కీలకమైన పదవులను చేపట్టారు. లక్నోలోని డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ యూనివర్శిటీ మేనేజ్మెంట్ బోర్డులో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. కోల్కతాలోని ఐఐఎంలోని బోర్డ్ ఆప్ గవర్నర్స్లో సభ్యునిగా ఉన్నారు. 2002లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రసంగించారు. ఎంపీ హోదాలో థాయ్లాండ్, నేపాల్, పాకిస్థాన్, సింగపూర్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూకే, యూఎస్ఏ, తదితర దేశాల్లో పర్యటించి అక్కడ రాజకీయపరిస్థితులపై అధ్యయనం చేశారు.
పార్లమెంటు సభ్యుడిగా క్లీన్ ఇమేజ్
రామ్ నాథ్కు ఉన్న క్లీన్ ఇమేజ్.. రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా ఉన్నా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. భారతదేశం గ్రామాల సమూహమని, అన్ని గ్రామాల్లోనూ మౌలికసౌకర్యాలు కల్పించాలని ఆయన ఎప్పుడూ కోరేవారు. ప్రత్యేకించి గ్రామాల్లో విద్యాసౌకర్యాల ఏర్పాటు కోసం ఆయన కృషి చేశారు. కాగా, బీజేపీ స్థాపించిన నాటి నుంచీ పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు రామ్ నాథ్. అంతేగాక, రామ్నాథ్ కోవింద్కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 1994లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఎంపీగా కొనసాగారు. కీలకమైన దళిత, ఆదీవాసీ సంక్షేమం, హోంశాఖ, పెట్రోలియం, సామాజిక న్యాయం, న్యాయం... తదితర పార్లమెంటరీ కమిటీలకు ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
న్యాయకోవిదుడిగా గౌరవనీయులు: పేదలకు ఉచిత సేవ
రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో 16 ఏళ్లు న్యాయవాదిగా సేవలు అందించారు. న్యాయవాదిగా పలు కేసులను వాదించి గెలిచారు. ఆయనంటే బార్కౌన్సిల్లో విశేషమైన గౌరవం. పేదలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగానే వాదించేవారు.
ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహం
బీజేపీ అగ్రవర్ణాల పక్షమని ప్రతిపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు కోవింద్ ఎంపికతో వారి ఆరోపణలకు శాశ్వతంగా చెక్పెట్టేసింది బీజేపీ. అంతేగాక, 2019 ఎన్నికలు, బీజేపీ పాలిత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉండటంతో ఈ ఎంపిక తమకు కలిసివస్తుందని బీజేపీ భావిస్తోంది. న్డీయే అభ్యర్థిని వ్యతిరేకిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, వామపక్షాలు, కాంగ్రెస్లు ఇంతకు ముందు ప్రకటించాయి. అయితే కోవింద్ అభ్యర్థిత్వంపై వారి అభిప్రాయం చివరి నిమిషంలో మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.
అప్పుడు కలాం... ఇప్పుడు రామ్నాథ్..
గతంలో ఎన్డీయే(వాజ్పేయి ప్రభుత్వం) అధికారంలో ఉన్న సమయంలో భారత మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దీంతో ఒక శాస్త్రవేత్తను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన ఘనత ఎన్డీయేకు దక్కింది. తాజాగా క్లీన్ ఇమేజ్ ఉన్న రామ్నాథ్ను ఎంపిక చేయడం ద్వారా దళితుల సంక్షేమానికి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పకనే చెప్పింది మోడీ ప్రభుత్వం. రామ్ నాథ్ ఎంపిక తమకు అన్ని విధాలా కలిసి వస్తుందని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది.