జయ మృతిపై అనుమానాలు: మోడీకి గౌతమి లేఖ
జయలలిత మృతి సంఘటన కొత్త మలుపు తీసుకుంటోంది. ఆమె మరణంపై ఎందుకు గోప్యతను పాటించారని ప్రశ్నిస్తూ సినీ నటి గౌతమి మోడీకి ఓ లేఖ రాశారు.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి సంఘటన కొత్త మలుపు తీసుకుంటోంది. అపోలో ఆస్పత్రిలో 75 రోజుల పాటు జయలలితకు చికిత్స అందించిన వైనం ఎందుకు గోప్యత పాటించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలను ప్రముఖ సినీ నటి గౌతమి వ్యక్తం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు ప్రశ్నలను సంధిస్తూ గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను తన బ్లాగ్లో పెట్టారు. కమల హసన్తో విడిపోతున్నట్లు ఇంతకు ముందు ఆమె తన బ్లాగ్లో పోస్టు పెట్టిన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఎందుకు అన్ని రోజులు గోప్యత పాటించారు? ఏ అధికారంతో ఆమెను కలవకూడదంటూ ఆంక్షలు విధించారు? ఆమె చికిత్సకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు? ఇలాంటి ప్రధానమైన అంశాలను గౌతమి తన లేఖలో ప్రస్తావించారు.
ప్రధాని ఈ విషయంపై స్పందించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృతి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌతమి సూచించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేతకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని ఆమె అనారు.