రూ.50కోసం శరీరాన్నే..: వివాదాస్పద రచనపై జార్ఖండ్ నిషేధం
ఇందులో ఆదివాసీలకు సంబంధించి మొత్తం 10కథలు ఉండగా.. 'నవంబర్ ఈజ్ ద మంత్ ఆఫ్ మైగ్రేషన్స్' పేరుతో రాసిన కథపై వివాదం చెలరేగింది.
రాంచీ: ఆదీవాసీ మహిళలను, వారి సంస్కృతిని కించపరిచేదిగా ఉందన్న కారణంతో 'ది ఆదివాసీ విల్ నాట్ డ్యాన్స్' అనే పుస్తకంపై జార్ఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. పుస్తకంలో పోర్న్ కంటెంట్ ఉందన్న విమర్శలు వెల్లువెత్తడటం.. రాష్ట్ర అసెంబ్లీలోను ఇదే అంశం చర్చకు రావడంతో దీనిపై నిషేధం తప్పలేదు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత హన్స్ దా సోవేంద్ర శేఖర్ రెండున్నర సంవత్సరాల క్రితం ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో ఆదివాసీలకు సంబంధించి మొత్తం 10కథలు ఉండగా.. 'నవంబర్ ఈజ్ ద మంత్ ఆఫ్ మైగ్రేషన్స్' పేరుతో రాసిన కథపై వివాదం చెలరేగింది.
రూ.50కోసం ఆదీవాసీ సంతాల్ మహిళలు తమ శరీరాన్ని అమ్ముకుంటారని, ఆ డబ్బుతో నచ్చిన తిండి తింటారని రచయిత ఆ కథలో పేర్కొన్నారు. అయితే వారి దారిద్ర్య పరిస్థితిని గురించి వివరించాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ప్రస్తావించానని రచయిత సోవేంద్ర చెబుతున్నారు.
అయితే ఆదీవాసీలతో పాటు, నెటినెన్స్ నుంచి కూడా ఈ పుస్తకంపై పెద్ద మొత్తంలో విమర్శలు వచ్చాయి. ఆదీవాసీ సంస్కృతిని చులకన చేసేలా వెలువరించిన ఈ పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్స్ పెరిగాయి. రచయిత సోవేంద్ర శేఖర్ దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు.
జార్ఖండ్ ప్రతిపక్ష పార్టీ జేఎంఎం(జార్ఖండ్ ముక్తి మోర్చా) దీన్ని అసెంబ్లీలో లేవనెత్తగా.. సీఎం రఘుబర్ దాస్ పుస్తకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్కెట్లో ఉన్న కాపీలను స్వాధీనం చేసుకుని రచయితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దీనిపై స్పందించిన రచయిత నయనతార సెహగల్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో పుస్తకాలను నిషేధించే హక్కు ప్రభుత్వాలకు లేదని గుర్తుచేశారు.
కాగా, విమర్శలు ఎదుర్కొంటున్న రచయిత సోవేంద్ర శేఖర్ 'ది మిస్టరీయస్ ఎయిల్మెంట్ ఆఫ్ రుపీ బాస్కీ' పుస్తకానికి గాను గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సోవేంద్ర.. రాంచీకి 400కి.మీ దూరంలోని పాకూర్ లో నివసిస్తున్నారు.