మానవత్వం మచ్చుకైనా..?: వెలుగుచూసిన మరో దారుణం
భోపాల్: గత వారం రోజులుగా దేశంలో జరగుతున్న వరుస సంఘటనలు మనుషుల్లో మానత్వం ఉందా? అనే ప్రశ్నలకు తావిస్తున్నాయి. మనుషుల్లో ఏమూలైనా కాస్తంత ఉందనుకుంటున్న మానవత్వం నేతిబీరలో నేతి చందమేనని భావించాల్సిన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి.
భార్య మృతదేహాన్ని తరలించేందుకు వాహనం ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించడంతో భార్య శవాన్ని మోస్తూ భర్త పది కిలోమీటర్లు నడిచిన వార్తను మరిచిపోకముందే, ఓ తల్లిశవాన్ని ముక్కలు చేసి మూటకట్టి తీసుకెళ్లిన ఘటన హృదయాలను కలిచి వేసింది. తాజాగా మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో మరో దయనీయ ఘటన జరిగింది.
బస్సులోనే మరణించిన బాలింతరాలి భర్తను, రోజుల వయసున్న పసిబిడ్డను జోరువానలో మార్గమధ్యంలో అడవి అనికూడా చూడకుండా బస్సు నుంచి దింపేసిన దుర్మార్గం శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఛత్తర్పూర్ జిల్లా నివాసి అయిన రామ్సింగ్ భార్య మల్లీబాయ్ కొద్దిరోజుల క్రితమే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తీవ్రంగా జబ్బున పడిన భార్యను తీసుకుని రామ్సింగ్ బస్సులో ఆస్పత్రికి బైలుదేరాడు. అయితే, మధ్యదారిలో బస్సులోనే భార్య ప్రాణాలు కోల్పోయింది. ఇది చూసిన మరుక్షణం డ్రైవరు బస్సును ఆపేశాడు.
భార్య శవాన్ని, పసిగుడ్డును తీసుకుని బస్సు దిగేయాల్సిందిగా కండక్టరు గట్టిగా చెప్పాడు. బైట కుండపోతగా వర్షం కురుస్తున్నా... బస్సులో ఉన్నఒక్క మనిషి కూడా కనికరించకపోవడం దారుణం.
అడవిదారిలో దిగిపోయి...చేతిలో బిడ్డ, రోడ్డుమీద భార్య శవంతో వర్షంలో దిక్కుతెలికుండా కూచున్న రామ్సింగ్ను అదేదారిన వెళుతున్న ఇద్దరు న్యాయవాదులు చూశారు. కారు ఆపి విషయం కనుక్కున్నారు.
అంబులెన్స్ను పిలిపించి రామ్సింగ్ భార్య మృతదేహాన్ని ఇంటికి పంపే ఏర్పాట్లు చేశారు. ఈ విషయంపై ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమకు అలాంటి సంఘటన జరిగిన సమాచారమేదీ అందలేదని చెబుతుండటం గమనార్హం.