యూపీకి బీజేపీ సీఎం అభ్యర్థిగా స్మృతి ఇరానీ?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు గాను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా స్మృతి ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయబాహుటా ఎగరవేసింది. 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మళ్లీ బీజేపీ హవాను కొనసాగించాలంటే ప్రజాదరణ కలిగిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనే భావనలో ఉంది. ఈ క్రమంలో స్మృతి ఇరానీ పేరుని తెరపైకి తెచ్చినట్టు సమాచారం.
ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న ఆర్ఎస్ఎస్, బయటి రాష్ట్రాలకు చెందిన వారు వద్దని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రజాదరణగల మహిళా నేతగా స్మృతి ప్రత్యర్థులకు గట్టి సవాళ్లను విసరగలదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. వాస్తవానికి యూపీలో సీఎం అభ్యర్ధిని ఎంపిక చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది.
దేశంలోని పెద్ద రాష్ట్రమైన యూపీలో బ్రాహ్మణులను ఎంపిక చేస్తే, ఠాకూర్లకు కోపం, ఠాకూర్లను ఎంపిక చేస్తే యాదవులకు కోపం, దళితులను ఎంపిక చేస్తే, అగ్రవర్ణాలకు దూరం అనే విధంగా అక్కడి రాజకీయాలు ఉంటాయి. ప్రస్తుతం స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
గడచిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం వరుణ్ గాంధీ లాంటి పైర్ బ్రాండ్ నేత కావాలని అంటున్నారు. స్మృతి ఇరానీతో పోలిస్తే వరుణ్ గాంధీకి ఉత్తరప్రదేశ్లో మంచి పేరుండటమే ఇందుకు కారణమని అన్నారు.