19 మంది ఎమ్మెల్యేలు చాలు: కరుణానిధి వ్యూహం..? రజనీ భేటీ
తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికమైన దశకు చేరుకున్నాయి. జయలలిత మరణంతో అవి మరింత వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారాన్ని అందిపుచ్చుకోవడానికి డిఎంకె పావులు కదుపుతుందా...
చెన్నై: అన్నాడియంకె ప్రభుత్వాన్ని కూల్చి తమ పార్టీని అధికారంలోకి తేవడానికి కేవలం 19 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే కరుణానిధి నేతృత్వంలోని డిఎంకెకు సరిపోతుంది. 234 మంది సభ్యులున్న తమిళనాడు శాసనసభలో డిఎంకెకు, దాని మిత్ర పక్షాలకు 98 మంది శాసనసభ్యులు ఉన్నారు. అధికార అన్నాడియంకె నుంచి 19 మంది శాసనసభ్యులను తమ వైపు తిప్పుకుంటే డిఎంకె, దాని మిత్రపక్షాలకు సరిపోతుంది.
అయితే, డిఎంకె అలా చేయడానికి సిద్ధంగా ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లేకుంటే ఎందుకనేది మరో ప్రశ్న. డిఎంకె అధినేత కరుణానిధిని ఆయన కుమారులు ఆళగిరి, స్టాలిన్ శనివారంనాడు కలిశారు. ప్రస్తుత స్థితిలో ఏం చేయాలనే విషయంపై కరుణానిధి వారితో చర్చించినట్లు సమాచారం. అన్నదమ్ములు ఈ స్థితిలో కలిసి పనిచేయాలనే సూచన కూడా ఆయన చేసినట్లు తెలుస్తోంది. జయలలిత జీవించి ఉన్నప్పుడు పరిస్థితి వేరు. జయలలిత మరణం తర్వాతి పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో కరుణానిధి ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 20వ తేదిన డీఎంకే పార్టీ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించి చర్చించాలని నిర్ణయించారు. డిసెంబర్ 20వ తేదీ పార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని పార్టీ సీనియర్లు, ఎంపీలు, శాసన సభ్యులకు శనివారం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. జయలలిత మరణించిన తరువాత డీఎంకే పార్టీ సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చకచక చెయ్యడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదే సమయంలో అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది ? పన్నీరు సెల్వం సీఎంగా ఉండటం ఆ పార్టీ నాయకులు ఇష్టమేనా ? అన్నాడీఎంకేలో చీలిక వస్తుందా ? వస్తే ఏమి చెయ్యాలి అని డీఎంకే నాయకులు ఆలోచనలో పడ్డారని సమాచారం.
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి, ఆ పార్టీలో అధికార సంక్షోభం లేదా నేతల్లో అసంతృప్తులు బహిర్గతమయ్యేంతవరకూ వేచిచూడాలని కరుణానిధి భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అన్నాడియంకెలో చోటుచేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలను నిశితంగా గమనించి తర్వాతే కార్యాచరణకు దిగాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబించాలని కరుణానిధి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ జిల్లాల కార్యదర్శులకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంలో బిజెపి పెద్దలు ప్రధాన పాత్ర పోషించారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బిజెపి ఏ విధంగా పావులు కదుపుతోందనే విషయంపై స్పష్టత కోసం కరుణానిధి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
బిజెపి అన్నాడియంకెకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఏ మాత్రం తాము తొందరపడినా పరిస్థితి ఎదురు తిరగవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు వేచి చూడాలా అనే విషయాన్ని కూడా కరుణానిధి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, పరోక్షంగా శశికళపై సినీ నటి దాడి ఎక్కు పెట్టడం, దాన్ని శరత్ కుమార్ ఖండించడం వంటి పరిణామాలను కూడా డిఎంకె నాయకులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అజిత్ అన్నాడియంకె పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ప్రజాకర్షణ గల సీనీ నటులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా డిఎంకె నాయకులకు అవసరంగా మారింది.
కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారంనాడు కరుణానిధిని కలిశారు. కరుణానిధి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చారు.. దాంతో ఆయనను పరామర్శించడానికి మాత్రమే రజనీకాంత్ గోపాలపురంలోని ఆయన నివాసానికి వెళ్లారని చెప్పడానికి వీలుంది. కానీ, ప్రస్తుత తరుణంలో ఇంకా ఏమైనా మతలబు ఉందా అనే కోణంలో కూడా ఆలోచన సాగే అవకాశాలున్నాయి.