బుద్ధి మార్చుకుంటే మంచిది: పాక్కు భారత్ హెచ్చరిక
ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు భారత్ గురువారం నాడు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
భారత్: ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్కు భారత్ గురువారం నాడు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద దాడులు నిలిపివేస్తేనే చర్చలు జరుపుతామని పాకిస్తాన్కు తేల్చి చెప్పింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే తూట్లు పొడుస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ ముందు తన తీరు మార్చుకోవాలని హితవు పలికింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో భారత్ ఎప్పుడూ సుముఖంగానే ఉందన్నారు. ఈ చర్చల కోసం పాక్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.
ప్రస్తుత పరిస్థితుల రీత్యా చర్చలకు అంగీకరించలేమని చెప్పారు. జమ్ము కాశ్మీర్ లోని నగ్రోటా దాడి ఘటనపై పూర్తి వివరాలు తెలిసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని, సార్క్ సమావేశాలను భారత్ రద్దు చేయించలేదని తెలిపారు.
నగ్రోటా దాడి ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దేశ భద్రతకు ఏది అవసరమో అదే చేస్తామని స్పష్టం చేశారు. సార్క్ సమావేశాలను భారత్మాత్రమే రద్దు చేయించలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సు నిర్వహించొద్దని అన్ని సభ్య దేశాలు ఏకాభ్రిపాయంతో నేపాల్కు లేఖ రాశాయని గుర్తు చేశారు.