రైల్వే నూతన మంత్రిగా.. నితిన్ గడ్కరి!?
రైలు ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నానని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించడంతో కొత్త రైల్వే మంత్రి బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నానని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించడంతో కొత్త రైల్వే మంత్రి బాధ్యతలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరికి అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
బుధవారంనాడు సురేష్ ప్రభు ఓ ట్వీట్లో.. తాను ప్రధాని మోడీని కలిసి తన రాజీనామా ప్రతిపాదనను ఆయన ముందుంచానని, ప్రధాని వేచి ఉండమని సూచించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రైల్వే బోర్డు చైర్మన్ పదవికి అశోక్ మిట్టల్ చేసిన రాజీనామాను బుధవారం ఆమోదించడం, కొత్త చైర్మన్గా ఎయిరిండియా సీఎండీ అశ్వని లోహానిని నియమించడం చకచకా జరిగిపోయాయి.
దీంతో సురేష్ ప్రభు రాజీనామా ప్రతిపాదనపై కూడా ప్రధాని వేగంగానే స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొద్ది గంటల్లోనే క్యాబినెట్ విస్తరణను మోడీ చేపట్టే అవకాశాలుండటంతో సురేష్ ప్రభు స్థానంలో రైల్వే మంత్రిగా గడ్కరిని నియమించే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
అయితే సురేష్ ప్రభు కోరినట్టుగా ఆయన రాజీనామాను ప్రధాని అంగీకరించినప్పటికీ వేరే శాఖను ఆయనకు కేటాయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సురేష్ ప్రభు పనితీరు, ఆ శాఖలో సమస్యలు, ఫిర్యాదుల పట్ల ఆయన వేగంగా స్పందించే తీరుపై గతంలో మోడీ పలుమార్లు ప్రశంసించిన సందర్భాలున్నాయి.