సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ: గోవా సీఎంగా పారికర్కు లైన్ క్లియర్
గోవా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం ప్రమాణం చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
పనాజీ/న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు బలం ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీని సుప్రీం ప్రశ్నించింది. ప్రభుత్వ ఏర్పాటుకు బలముంటే గవర్నర్ ను ఎందుకు కలవలేదని నిలదీసింది. సంఖ్యా బలంతో మొదట గోవా గవర్నర్ వద్దకు వెళ్లాలని సూచించింది. పిటిషన్ వేయడంపై కాంగ్రెస్ పార్టీపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలతో మధ్యాహ్నం 1.30గంటలకు గవర్నర్ను కలిసేందుకు సిద్ధమైంది. కాగా, సుప్రీం కోర్టుకు బీజేపీకి కూడా పలు సూచనలు చేసింది. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని సూచించింది. ప్రొటెం స్పీకర్ పేరును ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలను ఆదేశించింది.
సీఎంగా ప్రమాణానికి గ్రీన్ సిగ్నల్
అంతేగాక, మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణం చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. బల నిరూపణ గురువారం(మార్చి 16) నిరూపించుకోవాలని ఆదేశించింది.
కాంగ్రెస్ పిటిషన్ ఇది..
గోవా ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ మంగళవారం ప్రమాణం చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో గోవాలో ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చింది.
సుప్రీంకోర్టు కాంగ్రెస్ పిటిషన్పై మంగళవారం ఉదయం 10.30గంటలకు విచారించింది. కాగా, గోవా ముఖ్యమంత్రిగా మంగళవారం సాయంత్రం 5గంటలకు మనోహర్ పారికర్ ప్రమాణం చేయనున్నారు.