కొత్త ట్విస్ట్: తమిళనాడు సీఎంగా పన్నీరుసెల్వం, పళనికి డిప్యూటీ..?
మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలోని శశికళ వర్గం పూర్తిగా చిక్కుల్లో పడటంతో పన్నీరు వర్గం పావులు కదుపుతోంది.
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలోని శశికళ వర్గం పూర్తిగా చిక్కుల్లో పడటంతో పన్నీరు వర్గం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా వారు ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు.
పన్నీరుసెల్వంకు ఆర్థిక శాఖ పదవి ఇస్తే చాలునని తొలుత చెప్పారు. అయితే, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిలో శశికళను నియమించిన అంశం ఈసీ కోర్టులో ఉంది. కాబట్టి వారిని పార్టీ పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించినా టెక్నికల్గా శశికళనే చీఫ్.
విలీనం వెనుక..: శశికళ-పన్నీరులపై దీప బాంబు, మరో మలుపు ఖాయమని..
దీంతో పన్నీరుసెల్వం వర్గం తెరపైకి కొత్త డిమాండ్లు తీసుకు వస్తోంది. ఈ కారణంగా అన్నాడీఎంకేలోని రెండు వర్గాల కలయిక సస్పెన్స్ వీడిపోవడం లేదు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరనందునే పన్నీరువర్గం తెరపైకి కొత్త డిమాండ్లు తీసుకు వస్తున్నాయని తెలుస్తోంది.
పన్నీరును సీఎం చేయాలి
అన్నాడీఎంకే నుంచి శశికళను, ఆమె అక్క కొడుకు దినకరన్ను శాశ్వతంగా సాగనంపాలన్న తమ డిమాండును ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం నెరవేరుస్తుందన్న నమ్మకంతో పన్నీరుసెల్వం వర్గం ఉంది. అయితే, టెక్నికల్గా ఇబ్బంది వస్తుండటంతోనే పన్నీరువర్గం ఇతర డిమాండ్లను పెడుతోందని తెలుస్తోంది.
పన్నీరు సీఎం, పళని డిప్యూటీ?
అన్నాడీఎంకే ఇరువర్గాల్లో చర్చల్లో భాగంగా పన్నీరుసెల్వంకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన వర్గం చెబుతోంది. ప్రస్తుతం సీఎం పళనిస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి.. మరోసారి పన్నీరును సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన వర్గం గట్టిగా కోరుతోందని తెలుస్తోంది.
కొట్టిపారేసిన పళనిస్వామి వర్గం
అయితే, విలీన చర్చల్లో ముఖ్యమంత్రి మార్పు డిమాండ్ తెరపైకి వచ్చిందన్న అంశాన్ని పళనిస్వామి వర్గం మాత్రం కొట్టి పారేస్తోంది. 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి సీఎం అయ్యారని, ఆయన మార్పు అంశం చర్చకు రాలేదని చెబుతున్నారు.
పన్నీరుకు సీఎం పదవి వద్దు..
అన్నాడీఎంకే కర్నాటక యూనిట్ సెక్రటరీ వి పుగజెంతి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు సీఎం పదవి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. ఆయనకు వద్దనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
వరుస భేటీలు
ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో గురువారం కీలక సమావేశం జరగనుందని, ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, విలీనం చర్చలు, నిర్ణయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారా?
ఈ భేటీలో పళనిస్వామి తన రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారా చూడాల్సి ఉంది. పార్టీ కోసం కలుస్తామని చెబుతున్న నేతలు.. పదవులు వదిలేస్తారా చూడాలని అంటున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం కూడా మద్దతుదారులు, ఎంపీలు, సీనియర్ నాయకులతో తన నివాసంలో గురువారం సమావేశమవుతున్నారు.