మీరాను బలి? రామ్నాథ్దే గెలుపు: మనోళ్ల మద్దతు... ఇదీ ఓట్ల లెక్క
యూపీఏ, ఇతర విపక్షాలు మాజీ స్పీకర్ మీర్ కుమార్ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాయి. ఎన్డీయే తరఫున రామ్ నాథ్ కోవింద్ పేరును ఇప్పటికే ప్రకటించారు.
న్యూఢిల్లీ: యూపీఏ, ఇతర విపక్షాలు మాజీ స్పీకర్ మీర్ కుమార్ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నాయి. ఎన్డీయే తరఫున రామ్ నాథ్ కోవింద్ పేరును ఇప్పటికే ప్రకటించారు. అయితే, రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని లెక్కలు వేస్తున్నారు.
పేరుకే పోటీ అని చెబుతున్నారు. ఎన్డీయే పక్షాలతో పాటు, ఇతర పార్టీలతో కలిసి రామ్ నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని అంటున్నారు. దాదాపు 63.1 శాతం మద్దతు ఎన్డీయే అభ్యర్థి ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్నాథ్: ఎవరీ కోవింద్?
ఎన్డీయే (బిజెపి, మిత్ర పక్షాలు)కు 48.9 శాతం ఓట్లు ఉన్నాయి. ఎన్డీయేతర పార్టీలు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అన్నాడీఎంకే, బిజెడి, టీఆర్ఎస్ వంటి పార్టీల మద్దతుతో అది 63 శాతానికి పైగా అవుతుంది. దీంతో రామ్ నాథ్ గెలుపు ఖాయమని చెబుతున్నారు.
మీరా కుమార్ ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దింపి, ఆమెను బలిచ్చే మేకలా కాంగ్రెస్ పార్టీ మార్చి వేసిందని బిజెపి మండిపడింది. బిజెపి నేత ఎస్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. తాము ఓడిపోతామని వారికి తెలుసునని, మీరా కుమార్ స్పీకర్ పదవిలో ఎంతో ఉన్నతంగా నిలిచారని, అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిసి కూడా బలిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ స్పీకర్ మీరా కుమార్
ఓ దళితుడిపై మరో దళిత్ను పోటీకి దింపడం ద్వారా సమాజాన్ని విడదీయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి రామ్నాథ్ విజయం అత్యంత సులువని మరో బీజేపీ నేత ఎన్సీ షానియా అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న ఓ మహిళగా మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని తాను అభినందిస్తున్నానని, అయితే, కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని కూడా బేరీజు వేసుకుని ఉండాల్సిందన్నారు.
ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరు
రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరు కానున్నారు. మొత్తం నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మీరాను నిలిపినా రామ్నాథ్ దే విజయం
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్సీపీ, ఆర్జేడీ... తదితర విపక్షాలు మీరాకుమార్ను అభ్యర్థిగా ప్రకటించాయి. మాజీ లోకసభ స్పీకర్ మీరాకుమార్ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్నారు. బీహార్కు చెందిన మీరాకుమార్ తండ్రి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్. తొలితరం దళిత నాయకుల్లో ఆయనది కీలకస్థానం. మీరాను విపక్షాలు అభ్యర్థిగా నిలబెట్టినా ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ అవలీలగా విజయం సాధించనున్నారు.
నితీష్ మద్దతు
విపక్షంలోని జనతాదళ్ యునైటెడ్ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్కు మద్దతు ప్రకటించడంతో ప్రతిపక్ష బలం తగ్గిపోయింది. కోవింద్ బిహార్ గవర్నర్గా ఇప్పటి వరకుబాధ్యతలు నిర్వహించారు. ఆయనతో నితీశ్కు సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. వీటితో పాటు బీహార్లో దళితుల జనాభా ఎక్కువగా ఉంది. దీంతో కోవింద్కు మద్దతు తెలిపారు. బీహార్లో జనతాదళ్ యునైటెడ్, ఆర్జేడీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ నేతృత్వం వహిస్తున్నారు.
సంఖ్యా బలాన్ని బట్టి..
అన్నాడీఎంకేలోని పళనిస్వామి, పన్నీర్సెల్వం వర్గాలు కూడా రామ్ నాథ్ కోవింద్కు మద్దతు పలికాయి. దీంతో కోవింద్కు మద్దతు నిచ్చే సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. పార్లమెంటులోనూ, తమిళనాడు విధానసభలోనూ అన్నాడీఎంకే వర్గాలకు గణనీయమైన సంఖ్యాబలముంది. సంఖ్యాబలాన్ని తీసుకుంటే కోవింద్ విజయం ఖాయమని చెప్పవచ్చు.
ములాయం కూడా..
సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ రామ్నాథ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తున్నారు. ఎన్డీయేలోని కీలక పక్షమైన శివసేన రామ్నాథ్కు ద్ధతు తెలిపింది. దీంతో ఆయన విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
తెలుగు రాష్ట్రాల నుంచి టిడిపి, తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. కాగా, రాష్ట్రపతి పదవికి ఇద్దరు దళితనేతలు పోటీపడుతున్న ఎన్నిక ఇదే కావడం విశేషం. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం ఎన్డీయేకు ఉపకరించనుంది. యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే ఎక్కువ కావడం. దీంతో పాటు మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్... తదితర పెద్దరాష్ట్రాల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. దీంతో పాటు జేడీయు అధికారంలో ఉన్న బీహార్, అన్నాడీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు కూడా ఎన్డీయేకు దన్నుగా నిలవడంతో రామ్నాథ్ గెలుపు సులభమవుతుంది.