జయ ఆరోగ్యంపై కేంద్రం ఆరా: సీఎంగా పన్నీరు, జనరల్ సెక్రటరీగా శశికళ?
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం గురించి కేంద్రం ఎప్పటికి అప్పుడు ఆరా తీస్తోంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం గురించి కేంద్రం ఎప్పటికి అప్పుడు ఆరా తీస్తోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అపోలో వైద్యులు, లండన్ డాక్టర్ రిచర్డ్ బాలే ప్రకటించారు. దీంతో కేంద్రం మరింత అప్రమత్తమయింది.
తమిళనాట మారుతున్న రాజకీయాలు
జయలలిత ఆరోగ్యం విషమంగా ఉండటంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జయలలిత వారసుడు పన్నీరు సెల్వం అని చాలామంది తేల్చి చెబుతున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జయ వారసుడిని ఎంపిక చేస్తారు.
పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా చేయాలంటూ అందరు ఎమ్మెల్యేల నుంచి డిక్లరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఎప్పుడైనా ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పన్నీరు సెల్వం గతంలో సీఎంగా పని చేశారు.
జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ఆయనను సీఎంగా చేశారు. ఆమెకు నమ్మిన బంటు. ఇప్పుడు అందరి చూపు పన్నీరు సెల్వం వైపే ఉంది.
సోమవారం ఉదయమే పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమైన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా అందరు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యేలకు పార్టీ ముఖ్య నేతలు చెప్పారని తెలుస్తోంది. జయ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని వారు హామీ ఇచ్చారని తెలుస్తోంది.
జయలలితకు సన్నిహితురాలైన శశికళ నటరాజన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. పార్టీ నేతలు సోమవారం సాయంత్రం లేదా మరోసారి భేటీ అయి మిగతా విషయాలపై తుది నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు గవర్నర్ విద్యాసాగర రావుకు ఓ పిటిషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. సాయంత్రంలోగా సీఎం అభ్యర్థిగా పన్నీరు సెల్వంను ప్రకటించే అవకాశాలున్నాయి.
అధికార మార్పిడికి రంగం సిద్ధం
కాగా, మధ్యాహ్నం వస్తున్న వార్తల మేరకు అధికార మార్పిడికి రంగం సిద్దమైంది. కొత్త సీఎంగా పన్నీరు సెల్వంను ప్రకటించనున్నారు. 135 మంది ఎమ్మెల్యేల నుంచి సంతకాలు తీసుకున్నారు. జయ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో తమిళనాడులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.