దారుణం: కూతురు వెంటపడొద్దన్నందుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడు
లక్నో: తమ కూతురు వెంటపడొద్దని మందలించినందుకు ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్రువలిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు తన ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఇంటిపైకి ఎక్కిన నిందితుడు రఫీక్(25) పెంకులను తీసేసి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. బాధితురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు రఫీక్ను అరెస్ట్ చేశారు.
మృతురాలి కూతురును నిందితుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడని, అయితే ఆ అమ్మాయి అతడ్ని ఇష్టపడటం లేదని పోలీసులు తెలిసారు. తరచూ తన కూతురు వెంటపడటంతో మృతురాలు నిందితుడ్ని పలుమార్లు హెచ్చరించిందని, దీంతో ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.