ప్రియుడి కోసం గ్యాంగ్ రేప్ చేశారని యువతి
కోయంబత్తూరు: ప్రేమించిన యువకుడితోనే జీవించాలని అనుకున్న యువతి పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయింది. పోలీసులు ఇచ్చిన వార్నింగ్ తో ఆమె క్షమాపణ చెప్పి కేసు నుండి బయటపడింది.
పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని ఈ రోడ్డోలో 22 సంవత్సరాల యువతి ఒక సంవత్సరం నుండి లేడీస్ హాస్టల్ లో నివాసం ఉంటూ ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. ఈమె 26 సంవత్సరాల యువకుడిని ప్రేమించింది.
ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెప్పింది. ప్రేమ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చెయ్యడానికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
ప్రేమించిన వ్యక్తి దూరం అవుతాడని ఆందోళన చెందిన యువతి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. జులై 28వ తేదిన హాస్టల్ గదిలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసిన విషయం గుర్తించిన సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీశారు. ఇద్దరు వ్యక్తులు తన మీద అత్యాచారం చేశారని యువతి చెప్పింది.
హాస్టల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో శరవణపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్టల్ దగ్గరకు వెళ్లి యువతిని పిలుచుకుని ఇంటికి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
యువతిని విచారణ చేశారు. అయితే ఆమె పొంతనలేని సమాధానం ఇవ్వడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. తను ప్రేమ వివాహం చేసుకోవడానికి రేప్ చేశారని అప్పద్దం చెప్పానని నిజం అంగీకరించింది. అంతే పోలీసులకు ఎక్కడో మండిపోయింది. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని యువతిని హెచ్చరించి పంపించారు.