కదులుతున్న కారులో.. మూడు గంటల పాటు మహిళపై గ్యాంగ్ రేప్..
గజియాబాద్ : కదులుతున్న కారులో ఓ మహిళ (21) గ్యాంగ్ రేప్ కి గురైన ఘటన నోయిడా సమీపంలో చోటు చేసుకుంది. మాయ మాటలతో మహిళను కారు ఎక్కించుకున్న నిందితులు దాదాపుగా మూడు గంటల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలో పెయింటర్ గా పనిచేసే ఓ వ్యక్తి భార్య సోమవారం నాడు ఏదో పని నిమిత్తం సమీపంలోని గజియాబాద్ లోని భాటియా మోడ్ ప్రాంతానికి వెళ్లింది. వెళ్లిన పని పూర్తి చేసుకుని తిరిగి వస్తోన్న సమయంలో తోవలో ఎదురైన ఇద్దరు వ్యక్తులు.. ఆమె భర్తకు రోడ్డు ప్రమాదం జరిగిందని, వెంటనే ఆమెను తీసుకురావాల్సిందిగా ఆమె భర్త తమతో చెప్పాడని.. మాయ మాటలు చెప్పి మహిళను కారు ఎక్కించుకున్నారు.
రాత్రి సుమారుగా 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. హ్యుందాయ్ సాంట్రో కారులో వచ్చిన నిందితులు, మహిళను కారులో ఎక్కించుకున్న అనంతరం కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించారు. కూల్ డ్రింక్ తాగిన వెంటనే ఆమె స్పృహ కోల్పోవడంతో దాదాపుగా మూడు గంటల పాటు కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేసి రాత్రి గం.11 ల సమయంలో ఎన్.హెచ్-24 పై పడేసి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్ష్లు నిర్వహించిన డాక్టర్లు ఆమె అత్యాచారానికి గురైనట్టుగా నిర్దారించారు. కాగా విషయం తెలిసిన పోలీసులు ఐపీసీ-323 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఇద్దరు నిందితుల్లో ఒకరు బాధిత మహిళ కుటుంబానికి దగ్గరికి వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు నిందితుల్లో ఒకరిని వీరేందర్ నాగర్ గా గుర్తించిన మహిళ రెండో నిందితుడిని మాత్రం గుర్తించలేకపోయింది. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.