రేప్ అడ్డుకున్నందుకు యాసిడ్ దాడి: మహిళ మృతి
సూరత్: తనపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు ఓ మహిళపై ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఆమె చనిపోగా, ఆమె ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఉమర్వాడలో జరిగింది.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరేష్ కంజారియా తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి బాధితురాలు తన కుటుంబసభ్యులతో ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు అస్లాం షేక్, అతని ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై యాసిడ్ పోశారు.
యాసిడ్ దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితురాలు మృతి చెందగా, ఆమె ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలిని హేము రాథోడ్(30)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హేము కుమారులు రాజ్(19), ప్రేమ్(9)ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు.
నిందితులు అస్లాం షేక్, అతని ఇద్దరు స్నేహితులు రాజా విమల్నారాయణ్ శేఖర్, సర్ఫరాజ్ షేక్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసిపి కంజారియా తెలిపారు. హేము రాథోడ్ భర్త రాము రాథోడ్, ఆమె అత్త కౌసల్య రాథోడ్(48)లకు యాసిడ్ దాడిలో స్వల్ప గాయాలయ్యాయని ఏసిపి తెలిపారు.
తన భార్య హేమును అస్లాం షేక్ తరచూ వేధింపులకు గురిచేసేవాడని ఆమె భర్త రాము రాథోడ్ పోలీసులకు తెలిపాడు. ఈ విషయంపై అతని తండ్రికి కూడా గతంలో ఫిర్యాదు చేశానని చెప్పాడు. అయినా అతడు తన వైఖరి మార్చుకోకుండా తన భార్యపై అత్యాచారానికి యత్నించాడని తెలిపాడు.