టెక్కీ అక్రమ సంబంధం: ఇద్దరు బిడ్డలను చంపి భార్య ఆత్మహత్య
న్యూఢిల్లీ: కుటుంబ సమస్యల కారణంగా తల్లి ఇద్దరు బిడ్డలకు విషం పెట్టి హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని శంకరపుర ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శంకరపురలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు రాహుల్ ఠాకూర్, నీతూ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి తనిక్ (5), రియాన్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీతూ తన భర్త వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంది. అంతే కాకుండ రాహుల్ తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్వయంగా చూసింది.
ఈ విషయంపై నీతూ, రాహుల్ మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. కొన్ని సందర్బాలలో రాహుల్ రాత్రి పూట ఇంటికి వచ్చేవాడు కాదు. గురువారం ఇంటికి వచ్చిన భర్త రాహుల్ తో నీతూ గొడవ పెట్టుకుంది. ఆ సందర్బంలో అతను బయటకు వెళ్లి పోయాడు.
రాహుల్ రాత్రి ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం వేకువ జామున నీతూ ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించింది. తరువాత ఆమె బెడ్ రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. రాహుల్ సోదరుడు రాజేష్ ఠాకూర్ ఫిర్యాదు చేశాడని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.