దారుణంం: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ రేప్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఝాంజును జిల్లాలోని పిలాని ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన డ్రైవర్, కండక్టర్ అత్యంత పాశవికంగా కదులుతున్న బస్సులోనే ఓ మహిళ(36) ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
పిలానీ నుంచి హర్యానాలోని లోహరుకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. బస్సులో ఆమె ఒక్కతే ఉంది. ఆ సమయంలో తనను మొదట బస్సు కండక్టర్ కలియా(36) అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఆ బస్సు డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత తనను నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.