సిఎంని కలవనీయలేదని నిప్పంటించుకున్న మహిళ
ఛండీఘర్: పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఇంటిముందు ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. కంప్యూటర్ కోర్సుల్లో డిప్లొమా చేసిన గురుప్రీత్ కౌర్ అనే 38ఏళ్ల మహిళ నిరుద్యోగంతో కుంగుబాటుకు లోనై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అధికారులు తెలిపారు.
40శాతం కాలిన గాయాలైన ఆమెను హుటాహుటిన సెక్టార్-16లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉద్యోగం లభించని కారణంగానే నిరాశకు గురైన బాధిత మహిళ, ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. గుర్దాస్పూర్కు చెందిన బాధిత మహిళ గుర్ప్రీత్ కౌర్ కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్నారు. కాగా, సిఎం ఇంటి వద్ద ఉండే సిబ్బంది ఆమెను ప్రతీసారి ముఖ్యమంత్రిని కలవనీయకుండానే తిరిగి పంపిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.
కాగా, ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ జాకర్ పంజాబ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల సమస్యలను పట్టించుకోని సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్, డిప్యూటీ సిఎం సుక్బీర్ సింగ్ బాదల్ తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.