వింత: మహిళనే వివాహం చేసుకొన్న మహిళా ఎస్ ఐ
జలంధర్: ఓ మహిళను మరో మహిళా పెళ్ళాడిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకొంది. పోలీస్ శాఖలో ఎస్ ఐ గా ఉద్యోగం చేస్తోన్న మంజీత్ కౌర్ సంధూ 27 ఏళ్ళ యువతిని పెళ్ళి చేసుకొంది.
హిందూ సంప్రదాయం ప్రకారంగా జలంధర్ నగరంలోని ఓ దేవాలయంలోని వీరి పెళ్ళి జరిగింది. ఈ వివాహ వేడుకలో దగ్గరి మిత్రులు పాల్గొన్నారు. అయితే ఈ వివాహానికి ఆమె తన కుటుంబసభ్యులను ఒప్పించింది. ఈ వివాహవేడుకల్లో కుటుంబసభ్యులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గత ఎనిమిదేళ్ళుగా మంజీత్ కౌర్ ఎస్ ఐ గా పనిచేస్తున్నారు. మంజీత్ కౌర్ కుటుంబసభ్యుల సమక్షంలోనే సంప్రదాయబద్దంగా తన భార్యను తన ఇంటికి తెచ్చుకొంది. వీరి పెళ్లి జరిగిన కాసేపటికే వివాహఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేశాయి.
ఈ పెళ్ళిపై సోషల్ మీడియాలో మిశ్రమస్పందన వ్యక్తమౌతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వలింగ వివాహాలు నేరం కిందకు వస్తాయని పలువురు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి వీరి వివాహం ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.