తాగిన మత్తులో రెండో భర్త 17సార్లు పొడిచాడు, బతికింది
కోయంబత్తూరు: ఓ మహిళను ఆమె భర్త 17 కత్తిపోట్లు పొడిచాడు. అయితే, ఆమె ప్రాణాలతో బతికి బయటపడింది. ఈ సంఘటన కోయంబత్తూరులోని సెల్వాపూరం సమీపంలో గల ఎల్ఐసీ కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. 39 ఏళ్ల ఓ మహిళకు భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె 32 ఏళ్ల వ్యక్తిని ఐదేళ్ల క్రితం పెళ్లాడింది.
ఏదో విషయంలో ఇరువురి మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో ఆ భర్త ఆమె పైన కత్తితో పోట్లు పొడిచాడు. అదృష్టవశాత్తూ ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. కోయంబత్తూరు మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో (సీఎంసీహెచ్) కోలుకుంటోంది.
గాయాలపాలైన మహిళను కతిజగా గుర్తించారు. ఆమె సీజీవీ నగర్కు చెందిన వ్యక్తి. ఆమె మెడ, చేతులు, తదితరాల పైన పదిహేడు కత్తిపోట్లు పడ్డాయి. ఆమెకు వైద్యులు 24 కుట్లు వేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
ఆమె భర్త శక్తిదాస్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అతను ఓ పేయింటర్. భార్యపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వివరాలు వెల్లడించారు.
శక్తిదాస్ను కతిజ ఐదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఆమె పువ్వులు అమ్మి డబ్బులు సంపాదించుకుంటోంది. వీరిద్దరు కలిసి తాగేవారు. తాగిన మత్తులో అప్పుడప్పుడు గొడవ పడేవారు. గతంలో కతిజ తన భర్త పైన ఓసారి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు అతని పైన మూడు కేసులు నమోదు చేశారు. బుధవారం రాత్రి శక్తిదాస్ బాగా తాగి వచ్చాడు. తన పైన పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోమని ఆమెతో గొడవకు దిగాడు. ఆమె ససేమీరా అంది. దీంతో ఆగ్రహం చెందిన శక్తిదాస్ ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె అరవడంతో పక్కింటి వారు వచ్చారు. అతను పారిపోయాడు.
పోలీసు ఇన్సుపెక్టర్ రవికుమార్, అతని టీమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించింది. అలాగే కతిజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి, ఆమె నుండి సంఘటన గురించి వివరాలు సేకరించారు. అనంతరం సెల్వాపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడు శక్తిదాస్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.