ఎవరితో మాట్లాడుతున్నావ్: భర్తను పొడిచి చంపేసింది
నలంద(బీహార్): ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలవంతంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ జరిగింది. ఎప్పుడు చూసినా ఫోన్ లో మాట్లాడుతున్న భార్యను ప్రశ్నించిన భర్త ఆమె చేతిలోనే హత్యకు గురైనాడు.
బీహార్ లోని నలందలో నివాసం ఉంటున్న సతీష్ (36) అనే వ్యక్తి సోమవారం రాత్రి భార్య లలిత చేతిలో దారుణ హత్యకు గురైనాడు. సతీష్ ను వివాహం చేసుకోవడం లలితకు ఇష్టం లేదు. సతీష్ కు లలితను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
సతీష్ లలిత అక్క సంగీతను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అయితే సంగీత తన బావతో కలిసి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. లలితను ఆమె తండ్రి బలవంతంగా ఒప్పించి సంవత్సరం క్రితం వివాహం చేశారు.
సతీష్ సైతం తప్పనిసరిగా వివాహం చేసుకోవలసి వచ్చింది. పెళ్లిఅయినప్పటి నుంచి ఇద్దరి మధ్య రోజు గొడవ జరిగేది. లలిత నిత్యం ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతుండేది. ఇదే విషయంపై దంపతుల మధ్య గొడవ ఎక్కువ అయ్యేది.
సోమవారం రాత్రి సతీష్ గట్టిగా ఎవరితో మాట్లాడుతున్నావు అని లలితను ప్రశ్నించాడు. తరువాత సతీష్ బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయాడు. దాంతో కోపంతో ఉన్న లలిత పదునైన కత్తి తీసుకుని బెడ్ మీద నిద్రపోతున్న సతీష్ ను పదేపదే పొడిచింది.
తీవ్రగాయాలైన సతీష్ అక్కడికక్కడే మరణించాడు. పెళ్లి అయినప్పటి నుంచి తన కుమార్తె సతీష్ తో సంతోషంగా లేదని, నిత్యం సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో ఆవేశంతో లలిత హత్య చేసిందని ఆమె త్రండి పోలీసులకు చెప్పారు. లలితను పోలీసులు అరెస్టు చేశారు.