నడిరోడ్డుపై యువతి బట్టలూడదీసి, వీడియో తీశారు
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే, నడిరోడ్డుపై జనం చూస్తుండగా ఓ యువతిని వివస్త్రను చేశారు. అంతేగాక, వీడియోలు కూడా తీశారు. ఇంత దారుణం జరుగుతున్నా.. అక్కడున్న జనం చూస్తున్నారే తప్ప, వారిని అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విచారకరం.
ఉదంపూర్ జిల్లా జగనూ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఓ యువతిని వివస్త్రను చేసి వీడియో చిత్రీకరించారు. నిందితుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా ఉండటం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. నిందితుల్లో ఒకడు తన మొబైల్ ఫోన్తో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు.
వాట్సప్లోనూ ఈ వీడియోను ఉంచారు. పోలీసులు ఈ ఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఉదంపూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. బాధితురాలు మోటార్ బైక్పై వెళ్తుండగా నిందితులు ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు.
ఆమె ప్రతిఘటించడంతో బంధించి వివస్త్రను చేశారు. ఈ దుశ్చర్యను అక్కడున్న జనం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించకపోవడం దారుణమైన విషయం.