ఆన్ లైన్ లో మహిళ నగ్నచిత్రం.. పోస్ట్ చేసిందీ మరో మహిళే!
ఆడదానికి ఆడదే శత్రువు అంటే.. ఇదే. ఓ మహిళ తాను సహజీవనం సాగించిన మరో మహిళ నగ్న చిత్రాన్ని ఆన్ లైన్ లో పోస్ట్ చేసి వేధించింది.
ముంబై: ఇద్దరు మహిళలు.. ఇద్దరూ 45 ఏళ్ల వయసు వారే. గతంలో సహజీవనం కూడా చేశారు. అయితే ఇప్పుడు విడిపోయారు. ఆ తరువాత వారిలో ఒక మహిళ మరొకరి నగ్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేరానికి పాల్పడిన మహిళకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు కూడా నిరాకరించింది. ఈ ఇద్దరు మహిళలూ ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలోని పాథాలజీ విభాగంలో పని చేసేవారు.
దాదాపు దశాబ్దం పాటు ఇద్దరి మధ్య సంబంధం ఉండేది. ఇలాంటి కేసు తమ వద్ద నమోదు కావడం ఇదే తొలిసారి అని ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
వీరిద్దరిలో ఒక మహిళకు అంతకుముందే వివాహం కూడా అయింది. భర్తతో ఆమె విడిపోయిన తరువాత వీరిద్దరూ దగ్గరయ్యారు. అయితే ఆర్నెల్ల క్రితం విభేదాలు రావడంతో ఈ మహిళలిద్దరూ విడిపోయారు.
ఆ తరువాత.. గత రెండేళ్లుగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా తన నగ్న ఫొటోలను మరో మహిళ పంపుతున్నట్లు బాధితురాలు గుర్తించింది. చివరికి ఆమె వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ గా కూడా తన నగ్న ఫొటోలే వాడుతున్నట్లు గుర్తించిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది.
గతంలో తాను ఆమెతో గొడవ పడ్డానని, ఆ కోపంతో తాను బాత్రూంలో ఉండగా తనకు తెలియకుండా ఆమె తన ఫొటోలు తీసిందని, ఆ విషయంలో ఇద్దరికీ గొడవ కూడా అయిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
తన ఫొటోలు అందరికీ పంపుతానని బెదిరించి ఆమె వెళ్లిపోయిందని, ఇంత చేసి కూడా తనకేపాపం తెలియదని ఇప్పుడు బుకాయిస్తోందని బాధితురాలు వాపోయింది. ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి 4న పోలీసులకు ఫిర్యాదు అందగా, వారు విచారణ జరిపి, నేరానికి పాల్పడిన మహిళను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేరానికి పాల్పడిన మహిళ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా కోర్టు నిరాకరించింది.