కదులుతున్న ఆటోలో మహిళా టెక్కీపై దాడి, దోపిడీ
ఆటోలోకి గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేసి ఆమెపై దాడి, ఆమె వస్తువులను దోచుకుని వెళ్లాడు. ఆటో డ్రైవర్ కూడా ఆ సంఘటనలో పాలు పంచుకున్నాడు. సహాయం కోసం ట్రాఫిక్లో ఆమె కేకలు వేసినా పట్టించుకున్నవారు లేరు. చివరకు ఆమె హులిమావుకు 3 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 7 గంటలకు కిందికి తోసేసి వెళ్లిపోయారు.
మధుమతి మైకో లేఅవుట్ పోలీసు స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. మధుమతికి చెందిన 70 గ్రాముల ఆభరణాలను దోచుకుని వెళ్లారు. వాటిలో బంగారు గొలుసు, మంగళసూత్రం, బ్రాస్లెట్, చేతి ఉంగరాలు, ఐపోడా, నోకియా మొబైల్, హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి.
ఆ సంఘటన బిలేకహళ్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా గుర్తించలేకపోయింది. జెపి నగర్లో ఆమె ఆఫీస్ వద్ద ఈ భయందోళనలకు గురి చేసే సంఘటన ప్రారంభమైంది. ఆటో నడుస్తుండగానే ఓ వ్యక్తి ఎక్కేసి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. వారిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు.
తన ఇంటికి సమీపంలోకి రాగానే ఎడమ పక్కకు మలుపుకోవాలని చెప్పింది. అయితే, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి ప్యాసెంజర్ సీట్లోకి వచ్చాడు. ఆమె పక్కన కూర్చుని పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఆమెను కొట్టాడు, బెదిరించాడు. ఆమె వస్తువులన్నీ లాక్కున్నాడు.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న సిసిటివి కెమెరా సరిగా పనిచేసి ఉంటే ఆటోను గుర్తించగలమని పోలీసులు అంటున్నారు. అయితే, ఆ సిసిటివీ కెమెరా పనిచేయడం లేదని చెబుతున్నారు. అయితే, మిగతా సిసిటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని పోలీసులు అన్నారు.