రాహుల్ సభకు పోటెత్తిన మహిళలు: భారీ సంఖ్యలో తరలివచ్చారు..
భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు పురుషులను పక్కకు తప్పుకునేలా చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. తొలిసారిగా ఒక ఎన్నికల సభకు ఇంత భారీ మొత్తంలో మహిళలు తరలివచ్చారని అన్నారు
లక్నో: యూపీ ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. ఆసక్తికరంగా ఆయన సభలకు భారీ ఎత్తున మహిళలు తరలి వస్తుండటం విశేషం. తాజాగా రాయ్ బరేలీలోని ఛాటో గ్రామంలో రాహుల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనగా.. భారీగా మహిళలు సభకు తరలివచ్చారు.
పోటెత్తిన మహిళా జనంతో సభలో ఎక్కువ మంది వారే కనిపించారు. కాగా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మహిళలు ఇంత భారీ ఎత్తున సభలకు తరలిరావడం చాలా అరుదని పరిశీలకులు చెబుతున్నారు. భారీగా తరలివచ్చిన మహిళా మద్దతుదారుల గురించి రాహుల్ తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు పురుషులను పక్కకు తప్పుకునేలా చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. తొలిసారిగా ఒక ఎన్నికల సభకు ఇంత భారీ మొత్తంలో మహిళలు తరలివచ్చారని అన్నారు. గతంలో మోడీ చెప్పినట్లు మీ బ్యాంకు ఖాతాల్లోకి రూ.15లక్షలు వచ్చాయా? అని ప్రశ్నించారు.
సంపన్నుల ప్రయోజనాల కోసం మాత్రమే మోడీ సర్కార్ పనిచేస్తున్నదని రాహుల్ విమర్శించారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మహిళలకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని, వారి కుటుంబ భద్రత కపోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తామని రాహుల్ ఈ సందర్బంగా హామి ఇచ్చారు.