దమ్ముందా: మోడీకి కేజ్రీ సవాల్, 'మహా' సీఎంపై చర్చలు
న్యూఢిల్లీ/ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం భారతీయ జనతా పార్టీకి సవాల్ విసిరారు. మహారాష్ట్ర, హర్యానాల్లో మునుపెన్నడూ లేనిరీతిలో సత్తా చాటిన బీజేపీ ఇప్పటికైనా ఢిల్లీ ఎన్నికలకు ముందుకొచ్చే ధైర్యం చేస్తుందా? అంటూ ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాజీనామా చేసినప్పటి నుండి ఢిల్లీ రాష్ట్రపతి పాలన సాగుతోంది.
మహారాష్ట్ర సీఎం పీఠంపై చర్చలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిశారు. మహారాష్ట్రలో అధికారం చేపట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యమంత్రి అభ్యర్థి, పొత్తులు తదితర అంశాలపై వారిద్దరూ తీవ్రంగా చర్చించారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీతో పొత్తు అంశంపై ఆయన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో చర్చించారు. బీజేపీకి మద్దతిచ్చే అవకాశముందని అంటున్నారు. నేడో రేపో అధికారికంగా ప్రకటించవచ్చునని చెబుతున్నారు.
హర్యానా పీఠంపై...
హర్యానా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ అభ్యర్థి అధిరోహించే ముహూర్తం ఖరారైంది. సరిగ్గా దీపావళి పర్వదినాన తమ అభ్యర్థిని హర్యానా సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు బీజేపీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే, సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమించాలన్న విషయంలో పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
మంగళవారం జరగనున్న ఆ రాష్ట్ర బీజేపీ శాసన సభాపక్ష భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఖరారు కానుంది. ఈ భేటీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పరిశీలకుడి హోదాలో హాజరుకానున్నారు. ఆరెస్సెస్ నేపథ్యమున్న మనోహర్ లాల్ ఖత్తార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ విలాస్ శర్మ, పార్టీ అధికార ప్రతినిధి కెప్టెన్ అభిమన్యుల పేర్లు సీఎం రేసులో ఉన్నాయి.
బీజేపీకే వదిలేస్తున్నాం: ఆరెస్సెస్
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మద్దతు ప్రకటించిన అంశంపై ఆరెస్సెస్ స్పందించింది. ఎన్సీపీ మద్దతు అంశాన్ని బీజేపీకి వదిలేస్తున్నట్లు చెప్పింది. అయితే, బీజేపీ శివసేన సంబంధాలు మెరుగుపడతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది. ఎన్సీపీతో కంటే శివసేనతో వెళ్లడమే మంచిదని ఆరెస్సెస్ ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే.