నీతా అంబానీకి వై కెటగిరీ భద్రత: ఎందుకు?
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి సిఆర్పిఎఫ్ నుంచి వై కేటగిరి భద్రత లభించనుంది. అయితే ఆమెకు ఉచితంగా ఈ భద్రత కల్పించడం లేదు. వ్యయమంతా నీతాయే భరిస్తుంది. వై కేటగిరి కింద మొత్తం 20 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఆమెకు 24 గంటలూ రక్షణగా ఉంటారు.
దేశంలో ఆమె ఎక్కడకు వెళ్లినా ఆ భద్రత ఉంటుంది. నీతా అంబానీకి ప్రాణహాని లేకున్నా కేంద్ర హోంశాఖ అనుమతితో ఈ పెయిడ్ సెక్యూరిటీ సర్వీస్ పొందారు. అయితే ఆమె భర్త ముఖేశ్ అంబానీకి మాత్రం జాతి వ్యతిరేక శక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు జడ్ కేటగిరి రక్షణ కల్పిస్తున్నారు.
దీనికి కూడా ఖర్చు పూర్తిగా ఆయనే భరిస్తారు. జడ్ కేటగిరి కింద 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పూర్తి సమయం ఆయనకు రక్షణగా నిలుస్తారు. ఆయన నివాసం నుంచి కార్యాలయం వరకూ 24 గంటలూ ఆయనకు రక్షణగా ఉంటున్నారు. టి20 ఫ్రాంచైజీ కలిగి ఉండటంతో పాటు దేశ వ్యాప్తంగా అనేక ధార్మిక, సేవా కార్యక్రమాల్లో నీతా అంబానీ బిజీబిజీగా ఉంటారు.
దీంతో ఆమెకు రక్షణ కల్పించాలన్న వినతి మేరకు కేంద్ర హోంశాఖ ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ఈ విషయం చెప్పారు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే ఐపిఎల్ మ్యాచుల సందర్భంగా ఫ్యాన్స్ ఆమె చుట్టూ గుమికూడడం, ఆమెతో సెల్ఫిలు దిగడం పరిపాటిగా మారింది. ఇక నుంచి అటువంటి సంఘటనలకు అవకాశం ఉండదు.