సుఖేష్ని కలిశా: వీడియోతో దినకరన్ మైండ్ బ్లాక్, శశికళకు ఊహించని షాక్
అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్కు ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు షాకిచ్చారు. అంతకుముందు రెండు రోజులు విచారించిన పోలీసులు, మూడో రోజు కూడా విచారించారు.
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్కు ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు షాకిచ్చారు. అంతకుముందు రెండు రోజులు విచారించిన పోలీసులు, మూడో రోజు కూడా విచారించారు. తనకు మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదని ఇప్పటి వరకు చెప్పిన దినకరన్.. తాజా విచారణలో తెలుసునని చెప్పాడు.
సుఖేష్తో తనకు పరిచయం లేదని, హైకోర్టు న్యాయమూర్తి అనుకొని మాట్లాడానని తొలుత చెప్పాడు. దీంతో ఢిల్లీ పోలీసులు వీడియో అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో దినకరన్ తనకు సుఖేష్ తెలుసునని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
దినకరన్ మైండ్ బ్లాంక్
విచారణలో భాగంగా ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనకు సోమవారం చుక్కలు చూపించారని సమాచారం. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును ఈసీ స్తంభింప చేయగా.. ఆ గుర్తు కోసం దినకరన్ రూ.50 కోట్లకు పైగా ఈసీకి లంచం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయనను విచారిస్తున్నారు.
మూడో రోజు..
ఢిల్లీ పోలీసులు శనివారం నుంచి దినకరన్ను ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు 7 గంటలు, ఆదివారం 10 గంటలపాటు విచారించిన పోలీసులు.. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి పొద్దుపోయేదాకా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలిసింది.
తొలుత బుకాయించే ప్రయత్నం చేసిన దినకరన్
దినకరన్కు, సుఖేశ్కు సంబంధాలు ఉన్నాయని ఆయన సహాయకుడు జనార్దనన్, కర్ణాటకకు చెందిన స్నేహితుడు మల్లికార్జున వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులు ఈ విషయం ప్రస్తావించడంతో, సుఖేశ్తో సెల్ఫోన సంభాషణలను జరిపినట్లు దినకరన్ అంగీకరించారు. అయితే, మాట్లాడుతున్నది సుఖేశ్ అనుకోలేదని, ఢిల్లీ నుంచి హైకోర్టు జడ్జి మాట్లాడుతున్నారనుకుని అనుకున్నానని, అందుకే సుఖేశ్ ఫోన్ కాల్ తీసుకున్నానని బుకాయించేందుకు ప్రయత్నించారు.
వీడియో అస్త్రం బయటకు తీసిన పోలీసులు
దీంతో, దినకరన్, సుఖేశ్ మధ్య జరిగిన వీడియో సంభాషణలను పోలీసులు చూపించారు. పోలీసులు ఇచ్చిన షాక్తో ఎట్టకేలకు.. సుఖేశ్తో తన పరిచయాన్ని దినకరన్ అంగీకరించాడని తెలుస్తోంది. ఆ తర్వాత సుఖేశ్తో పరిచయం.. కొనసాగింపు, నగదు ఢిల్లీకి ఎలా పంపించారు? ఎవరి ద్వారా ఈసీ అధికారులకు ఇవ్వాలనుకున్నారు? ఈ వ్యవహారంలో ఎవరెవరి జోక్యం ఉంది తదితర వివరాలను పోలీసులకు చెప్పారని తెలుస్తోంది.
వాట్సాప్ రికార్డులు కూడా.. రూ.10 కోట్లు తీసుకున్న సుఖేష్
దినకరన్ - సుఖేష్ చంద్రశేఖర్లు వాట్సాప్ సందేశాలు కూడా పంపించుకున్నారని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దీని ద్వారా ఇరువురు ఒకరికొకరు తరుచూ అందుబాటులో ఉన్నారని తెలుస్తోంది.
రెండాకుల గుర్తు వచ్చేలా చేయడం కోసం దినకరన్ రూ.50 కోట్లకు పైగా ఈసీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందులో రూ.10 కోట్లను అప్పటికే సుఖేష్కు అప్పగించాడు. ఇందులో రూ.1.3 కోట్లు పోలీసులు అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అడ్డంగా బుక్... శశికళకు ఊహించని షాక్
సుఖేష్ ఎవరో తెలియదని దినకరన్ ఇప్పటి దాకా చెప్పుకుంటూ వచ్చాడు. తాజా పోలీసులు ఇచ్చిన ఝలక్తో తప్పును అంగీకరించాడు. పోలీసులు వీడియో రూపంలో దినకరన్ను అడ్డంగా బుక్ చేయడం శశికళకు ఊహించని షాక్ అని అంటున్నారు.