గుజరాత్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా యోగి: వ్యూహా రచనలో బీజేపీ..
మొత్తం 182స్థానాలున్న గుజరాత్ లో ఈ దఫా 150సీట్లను కొల్లగొట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు రచించే పనిలోపడింది.
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో ఎన్నికల కోసం సిద్దమవుతోంది. యూపీలో సాధించిన అఖండ విజయంతో ఇప్పుడు దేశమంతా ఆ రాష్ట్ర సీఎం యోగి పేరు మారుమోగుతుండటంతో.. గుజరాత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన్నే రంగంలోకి దించాలనే వ్యూహంలో బీజేపీ ఉంది.
ఇదే విషయాన్ని తాజాగా గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జితూ వాఘాని పార్టీ నేతలతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. యోగిని ప్రచార బరిలో దించడం ద్వారా గుజరాత్ లో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకోగలదని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తం 182స్థానాలున్న గుజరాత్ లో ఈ దఫా 150సీట్లను కొల్లగొట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు రచించే పనిలోపడింది.
రాష్ట్రంలోని ద్వితీయ స్థాయి నేతలను ఏకం చేసి పార్టీ ప్రచార కార్యక్రమాలపై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జితూ వాఘాని ఆదివారం నాడు స్థానిక సంస్థల చీఫ్ లతో పాటు సౌరాష్ట్ర, రాజ్ కోట్ వంటి జిల్లాల ప్రతినిధులతో భేటీ అయి ప్రచార కార్యక్రమాల గురించి చర్చించారు. జితూ వాఘాని భావ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా.. సీఎం రూపానీ రాజ్ కోట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
ఈ ప్రాంతాలన్ని బీజేపీకి అత్యంత కీలకం కావడంతో వీటిపై ప్రధానంగా దృష్టి సారించాలని పార్టీ భావిస్తోంది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో మొత్తం 53సీట్లు ఉండగా.. అందులో 35స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ అభ్యర్థులు ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుకుని కనీసం 40సీట్లు దక్కించుకోవాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది.
ఇప్పటిదాకా బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లుగా ముద్రపడ్డ నరేంద్ర మోడీ, అమిత్ షాలకు, యోగి ఆదిత్యనాథ్ కూడా మంచి క్యాంపెయినర్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోగిని గుజరాత్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా బరిలో దించనున్నట్లు సమాచారం.