బీజేపీలో కొత్త పంచాయితీ: ఆర్ఎస్ఎస్xహిందూ యువ వాహిణి, యోగిపై అసంతృప్తి
యోగి యూపీ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థలో చేరికలు పెరగడం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మింగుడుపడటం లేదు.
లక్నో: గ్రూపు రాజకీయాలు మనదేశ పొలిటికల్ పార్టీల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఒకే గూటిలో ఉన్నా సరే.. ఎవరి గ్రూపు వారు మెయింటైన్ చేసే పరిస్థితి అన్ని పార్టీల్లోను నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సైతం ఈ పరిస్థితి తప్పడం లేదు. యూపీ సీఎంగా ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న యోగి ఆదిత్యనాథ్ పై కేంద్రం తీవ్ర అసంతృప్తితో ఉంది.
యోగి ఆదిత్యనాథ్కు చెందిన హిందూ యువ వాహిణి సంస్థ.. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ను పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేకుండా హిందూ యువ వాహిణి స్వతంత్రంగా వ్యవహరించడం బీజేపీ పెద్దలకు గిట్టడం లేదు.
యోగి యూపీ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థలో చేరికలు పెరగడం కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మింగుడుపడటం లేదు. దీనిపై యూపీ బీజేపీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో తొలి ప్రాధాన్యం బీజేపీకి, దాని కార్యకర్తలకే ఉండాలన్నారు. అంటే, హిందూ యువ వాహిణి తన ప్రాబల్యం పెంచుకోవడం బీజేపీ నేతలకు ఏమాత్రం సహించడం లేదనే విషయం స్పష్టమవుతోంది.
కాగా, యోగి నామినేషన్ సమయంలోను ఇలాంటి స్వతంత్ర వాహిణి సంస్థలను బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే హిందూ యువ వాహిణి, ఆర్ఎస్ఎస్ లో కలుస్తుందని వారు భావించినప్పటికీ.. దానికదే స్వతంత్రంగా వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగాయి.
దీనికి తోడు ఈ ఏడాది భారీ నియమాకాలు చేపట్టాలని హిందూ యువ వాహిణి భావిస్తుండటం బీజేపీకి మరింత ఆగ్రహం కలిగేలా చేస్తోంది. ఆర్ఎస్ఎస్ ను కాదని స్వంత కార్యాచరణతో ముందుకెళ్లడం బీజేపీ తట్టుకోలేకపోతోంది. చూడాలి మరి.. ఆర్ఎస్ఎస్ వర్సెస్ హిందూ యువ వాహిణి విభేదాలు ఇంకెంత దూరం వెళ్తాయో!