కదులుతున్న రైల్లో యువతిపై అత్యాచారం: నిందితుడి అరెస్ట్
గౌహతి: కదులుతున్న రైలులో 20ఏళ్ల మహిళపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అస్సాంలోని టిన్సుకియా జిల్లా పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటనలో నిందితుడికి సహకరించిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... బెంగుళూరులోని ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న బాధితురాలు (20) దుర్గా పూజ కోసం సొంతూరు అసోంలోని టిన్సుకియా వెళ్లేందుకు బెంగళూరు-టిన్సుకియా ఎక్స్ప్రెస్ రైలులో బయల్దేరింది.
ఆమెతో పాటు అదే బోగీలో ప్రయాణిస్తున్న చాలామంది ప్రయాణికులు డిబ్రుగఢ్ స్టేషన్లో దిగిపోయారు. గురువారం రాత్రి ఆ కంపార్టుమెంట్లో ఉన్న ముగ్గురు యువకులు ఆ యువతిని టాయ్లెట్లోకి లాక్కెళ్లగా, వీరిలో ఒకడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
శుక్రవారం ఉదయం రైలు టిన్సుకియా స్టేషన్కు చేరుకున్న తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన సోదరుడికి బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. వెంటనే అతడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రహ్లాద్ ఛెత్రిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. యువతిపై లైంగికి దాడి ఘటనలో మరో ఇద్దరు నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడలేదని, నిందితుడికి సహకరించారని పోలీసులు చెప్పారు.