బాబుపై నో, జగన్పై విచారణకు 22 బృందాలు: మిథున్రెడ్డి
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణ బిల్లుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట శాసన సభ్యుడు మిథున్ రెడ్డి బుధవారం లోకసభలో తెలిపారు. సీబీఐ డైరెక్టర్ల నియామకంలో సవరణల పైన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సీబీఐ అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారుతోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు సీబీఐని వాడుకుంటున్నారన్నారు. తమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా సీబీఐని ఇలాగే ఉపయోగించారన్నారు.
ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినా వైయస్ జగన్ పైన కేసులు మోపారన్నారు. ఓ వైపు సీబీఐ వద్ద సిబ్బంది లేరంటూనే, మరోవైపు జగన్ కేసులో 22 బృందాలు పని చేశాయన్నారు. మరో కేసులో విచారణ చేపట్టేందుకు తమకు తగినంత సిబ్బంది లేదని సీబీఐ కోర్టుకు చెప్పిందని, ఎలాంటి వివక్షకు తావివ్వకుండా సీబీఐ పని చేయాలన్నారు. అందుకే సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని అభిప్రాయపడ్డారు.
సీబీఐ పక్షపాత వైఖరితో వ్యవహరించేందుకు ప్రస్తుత మార్గదర్శకాలు ఊతమిస్తున్నాయన్నారు. సీబీఐ ఆశ్రిత పక్షపాతాన్నే అవలంభిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుపై దర్యాప్తు జరపాలన్న ప్రభుత్వ వినతికి సిబ్బంది లేరన్న సీబీఐ, జగన్ పైన విచారణకు మాత్రం ఆగమేఘాల మీద 22 బృందాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పార్లమెంట్ ముందుకు వచ్చిన సీబీఐ డైరెక్టర్ల నియామక సవరణ బిల్లుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. సీబీఐ డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న మార్గదర్శకాల పైన ఆ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, సీబీఐ డైరెక్టర్ల ఎంపికకు తోడ్పడే చట్ట సవరణ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష నేత లేకుండా సీబీఐ సంచాలకుడి ఎంపికకు మార్గం సుగమమైంది.
అంతకుముందు వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా కోసం తాము అడుక్కోవడం లేదన్నారు. సీబీఐ డైరెక్టర్ల నియామకంలో సవరణల పైన చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విధానాలు పాటించాలని, ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.