సర్జికల్ స్ట్రైక్స్ పై రాజకీయమా ? వైఎస్ఆర్ సీపీ
విశాఖపట్టణం: భారత సైన్యం ఎంతో వీరోచితంగా ప్రాణాలకు తెగించి సర్జికల్ స్ట్రైక్ దాడులు చేస్తే కొంత మంది నాయకులు వాటిని విమర్శించడం సిగ్గుచేటు అని, ఇది ఏమాత్రం సహించే విషయం కాదని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు.
శుత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్ లు ఎప్పుడెప్పుడు భారత భూభాగాన్ని ఆక్రమించుకుందామా అని ఎదురు చూస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో భారత సైన్యం మనసు గాయపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదని హితవుపలికారు.
విశాఖపట్టణంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ దాడులు ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో జాతీయ భావాన్ని ఉప్పొంగేలా చేశాయని ఆయన అన్నారు.
ఇలాంటి సున్నితమైన విషయాల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా ఎవ్వరూ మాట్లాడటం సరికాదని విజయసాయి రెడ్డి చెప్పారు. భారత సైనికులు విజయవంతంగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ దాడులను అందరూ అభినందించాలని ఆయన అన్నారు.
అంతే కాని వాటిని రాజకీయం చేసి పబ్లిసిటీ కోసం పాకులాడటం అంతమంచిది కాదని సర్జికల్ స్ట్రైక్ దాడులపై విమర్శలు చేసిన వారికి హితవుపలికారు. 1980 కాలంతో పోల్చుకుంటే ప్రజాస్వామ్య, సామాజిక విలువలు రోజురోజుకు పడిపోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
దేశంలో ఇప్పటి పరిస్థితులు పోల్చుకుంటే భాషల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విడిపోయి స్వప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. భిన్నత్వంలో ఎకత్వం అనే నినాధంతో మన దేశం ముందంజ వేస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు.