ఇంగ్లాండులో సంగీత కచేరీపై ఆత్మాహుతి దాడి: 22మంది మృతి
ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ అరెనాలో అరేనా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 22మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
మాంచెస్టర్: ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ అరెనాలో అరేనా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 22మంది మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంగీత కచేరి ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా దళాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
సంఘటనలో 22మంది మరణించారని, 50 మంది గాయపడ్డారని పోలీసులు ఓ ప్రకటనలో చెప్పారు. దాడి ఉగ్రవాదుల పనే అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాంబు డిస్బోజబులు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
సంఘటనా స్థలానికి రావద్దని పోలీసులు ప్రజలను కోరారు. ప్రజలు అక్కడికి చేరుకుంటే సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని అన్నారు. రెండు పేలుళ్లు సంభవించినట్లు మీడియా వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.